సాగులో సమస్యలు వస్తే అన్నదాతలు వ్యవసాయాధికారులను కలువాలంటే ఒకప్పుడు మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థికభారం రైతులపై అదనంగా పడేది. వ్యవసాయాధికారులు సాగులో అధునాతన పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలంటే వేదిక దొరకడమే కష్టంగా ఉండేది. వీటన్నింటినీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను అందుబాటులోకి తెచ్చింది. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా గుర్తించి రూ.22 లక్షలు వెచ్చించి రైతువేదిక భవనం నిర్మించింది. నిర్వహణకు నెలనెలా రూ.9 వేలు అందజేస్తున్నది. వేదిక కేంద్రంగా వారం లో రెండు రోజులు వ్యవసాయాధికారులు రైతులతో సమావేశమై పంటల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆయిల్పామ్ సాగుపై దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాగు సమస్యల పరిష్కారంతో పాటు శిక్షణ కార్యక్రమాలు ముంగిట్లోనే అందుతుండడంతో రైతులు సంతోష పడుతున్నారు.
వరంగల్, జనవరి 2(నమస్తేతెలంగాణ) : వ్యవసాయ అధికారిని సంప్రదించాలంటే రైతులు గతంలో మండల కేంద్రం వెళ్లాల్సి వచ్చేది. మండల వ్యవసాయ అధికారి(ఎంఏవో), వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) మండల కేంద్రంలోని తమ కార్యాలయం కేం ద్రంగా విధులు నిర్వర్తించేవారు. వానకాలం, యాసం గి పంటల సాగు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమా లు కూడా అక్కడే జరిగేవి. రైతు పక్షపాతిగా పనిచేస్తు న్న తెలంగాణ ప్రభుత్వం ఇపుడు వీటన్నింటిని రైతుల ముంగిట్లోలోకి తెచ్చింది. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను గుర్తించింది. క్లస్టర్కో ఏఈవోను నియమించింది. రైతులు ఒకచోట కూర్చుని చర్చించుకోవడానికి ప్రతి క్లస్టర్లో రూ.22 లక్షలు వెచ్చించి రైతువేదిక భవనం నిర్మించింది. ఏఈవో, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్ హాలు ఉండేలా తీర్చిదిద్దింది.
ఏఈవో, కో ఆర్డినేటర్ కోసం రెండు టేబుళ్లు, రెండు ఎగ్జిక్యూటివ్ కుర్చీలు, ఎనిమిది ఎస్ టైపు కుర్చీలు, ఫైల్స్ భద్రపరిచేందుకు ఏఈవోకు ఒక బీరువాతో పాటు సమావేశాల నిర్వహణకు ఒక మైక్ సిస్టం సమకూర్చింది. విద్యుత్ చార్జీల కోసం గత మార్చి నెలాఖరు వరకు ఒక్కో వేదికకు నెలనెలా రూ.2 వేల చొప్పున ఇచ్చింది. గత ఏప్రి ల్ నుంచి ప్రతి రైతువేదిక నిర్వహణకు నెలనెలా రూ.9 వేలు కేటాయిస్తున్నది. వీటిలో విద్యుత్ చార్జీలకు రూ.వెయ్యి, స్వీపింగ్కు రూ.3 వేలు, వాటర్కు రూ.500, స్టేషనరీ, జిరాక్స్కు రూ.వెయ్యి, సమావేశా ల నిర్వహణకు రూ.2,500, ఇతర ఖర్చులకు రూ.వెయ్యి వెచ్చించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఏఈవోలు రైతువేదికలు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అటెండెన్స్ యాప్ కూడా అమల్లోకి తేవడంతో పనిదినాల్లో ఏఈవో కచ్చితంగా రైతువేదికను సందర్శిస్తున్నారు. తమ అటెండెన్స్ నమోదు కా వాలంటే ఏఈవో విధిగా ఉదయం 9 నుంచి 10 గంట ల సమయంలో లేదా ఉదయం ఫీల్డు, ఇతర పనుల్లోకి వెళ్తే ఏదేని ఒక సమయంలో రైతువేదికకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రైతులు వ్యవసాయ అధికారి కోసం మండల కేంద్రం వెళ్లాల్సిన అవసరం లేకుండా పో యింది. తమకు అందుబాటులో ఉన్న గ్రామంలోని రైతువేదికకు చేరుకుంటున్నారు. వ్యవసాయంలో తమ కు ఎదురైన ప్రతి సమస్యను ఏఈవో దృష్టికి తీసుకెళ్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక విధానాలు, యాం త్రీకరణ, మెళకువలను తెలుసుకుంటున్నారు.
పంటలకు ఆశించిన చీడపీడలపై సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్తో పాటు వ్యవసాయంలో ఇతర వివరాలను తెలుసుకుంటూ రైతువేదికల ద్వారా బహుళ ప్రయోజనాలను పొందుతున్నారు. గతంలో పంటల సాగుతో పాటు వ్యవసాయంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ, ఇతర అంశాలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించాలంటే వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులను వేదిక సమస్య వెంటాడేది. ప్రస్తుతం రైతువేదికల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దమ్ము చేసిన పొలంలో నేరు గా వరి విత్తే విధానం, అధిక సాంద్రత పత్తి సాగు పద్ధ తి, డ్రమ్సీడర్ వంటి సరికొత్త విధానాలపైనా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆయిల్పామ్ ప్రమోషన్ కూ డా వీటిలోనే జరుగుతోంది. వ్యవసాయ, ఉద్యాన శాఖ ల అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్న రైతుల నుంచి ఇక్కడే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ప్రతి వేదికలో స్థానిక ఏఈవో మంగళ, శుక్రవారం విధిగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయంపై ప్రభుత్వ నిర్ణయాలు, అమల్లోకి వచ్చిన పథకాలు, సబ్సిడీలు, నూతన విధానాలను తెలియజేయడంతో పాటు పంటల సాగు, వాతావరణ పరిస్థితులపై రైతులకు ఏఈవోలు సూచనలు చేస్తున్నారు. ఎంఏవో, ఏడీఏ, జిల్లా వ్యవసాయ అధికారితో పాటు కొన్ని సం దర్భాల్లో కలెక్టర్ కూడా పాల్గొంటున్నారు. రైతుబంధు పథకం, రైతుబీమా వంటి పథకాల అమల్లో ఏఈవోలు వేదికల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇలా తమకు వేదిక అందుబాటులోకి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.