‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అన్నట్లు దారి పొడవునా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ర్యాలీగా రైతు వేదికల వైపు కదిలాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాల ప్రదర్శనలతో ఇటు ఆడబిడ్డలు, రైతులంతా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తరలిన తీరు జాతరను తలపించింది. ఇలా అవతరణ వేడుకల్లో భాగంగా రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా అంతటా పండుగలా జరుపుకొన్నారు. ఆయాచోట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు సంబురాల్లో పాల్గొనగా ప్రతి పల్లె నుంచి రైతాంగం దండులా కదిలివచ్చింది. సమైక్య పాలనలో కుదేలైన వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని వారు కోరగా.. తమ కష్టాలు తీర్చుతున్న రైతుబాంధవుడికి జేజే పలుకుతూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రైతులకు సన్మానాలు, సహపంక్తి భోజనాలతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొంది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శనివారం రైతు దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో జరిగిన ఈ వేడుకలకు కర్షకులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు, బతుకమ్మలతో మహిళల కోలాటాలు, డప్పుచప్పుళ్లతో పల్లెలు సందడిగా మారాయి.
రైతువేదికల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలోని రైతు వేదికల్లో జరిగిన వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఎడ్లబండి నడిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం, అమ్మాపురం గ్రామాల్లో, జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతులలో, వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో, సంగెం మండలం గవిచర్లలోని రైతువేదికల్లో జరిగిన ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు.
మహబూబాబాద్ మండలం జంగిలికొండ రైతు వేదికలో జరిగిన వేడుకల్లో ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పాల్గొనగా, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో జరిగిన వేడుకల్లో చీఫ్విప్ వినయ్భాస్కర్ పాల్గొని స్వయంగా ఎడ్లబండి నడిపి రైతుల్లో ఉత్సాహం నింపారు. వర్ధన్నపేట మండలం కట్య్రాల, ఉప్పరపల్లి జరిగిన వేడుకల్లోఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. దుగ్గొండి మండల లక్ష్మీపురంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొనగా, మేకల ్రప్రభబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.