వరంగల్, డిసెంబర్ 28(నమస్తేతెలంగాణ) : యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసింది. తొలిరోజు జిల్లాలో 56,188 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.16,63,45,010 జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది తొలివిడుత వానకాలం ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత యాసంగికి మరో రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని ఈ నెల 28 నుంచి జమ చేస్తున్నది. జిల్లాలో 1,44,221 మంది రైతులకు రూ.132,54,85,928 పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గురువారం రెండు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం పంపిణీ చేస్తుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంట పెట్టుబడి కష్టం తీరింది..
నల్లబెల్లి, డిసెంబర్ 28 : రైతు బంధుతో కర్షకుల కష్టాలు తీరాయి. సాగుకు ముందే ఆర్థికసాయం అందుతుండడంతో అప్పుల వైపు కన్నెతి చూడడం లేదు. సమయానికి రైతుబంధు వస్తుందనే ఆత్మస్థైర్యంతో ఎవుసం చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దేశానికి అన్నం పెట్టే రైతును పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నదాతల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ర్టాన్ని దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా మార్చారు. సీఎం ముందు చూపుతో రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి.
– గూబ రాజు-తిరుపతమ్మ, రైతు దంపతులు. కొండాపూర్