ములుగు రూరల్, డిసెంబర్ 6 : రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది. ఇలా ఇగంతో రోజంతా వణికే బాధలు లేకుండా అందుబాటులోకి రూమ్హీటర్లు వచ్చేశాయి. స్విచ్ ఆన్ చేస్తే చాలు ఈ యంత్రం నిమిషాల వ్యవధిలో మీ ఇంటిని, ఒంటిని వెచ్చగా మార్చేస్తుంది. అందుబాటు ధరల్లో దొరుకుతుండడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు.
చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లోకి బహుళజాతి కంపెనీలు రూమ్ హీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ పరికరం ఇంటిని మొత్తం వెచ్చగా మార్చి శరీరానికి చలి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా రూ.1000 నుంచి రూ.2వేల మధ్యలో ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీందో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో ఈ రూమ్ హీటర్ల వినియోగం పెరిగింది. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రకు ప్రజలు ఇంటిని వెచ్చగా ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నారు.
చలి నుంచి రక్షణకు దోహదం
ఈ కాలంలో ఉండే తీవ్రమైన చలి వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి రూమ్హీటర్ రక్షిస్తుంది. చలి ప్రభావం వల్ల పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు జలుపు, దగ్గు, జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నందున ఇంటిని వెచ్చని కేంద్రంగా మల్చుకునేందుకు ఈ రూమ్ హీటర్లను ప్రజలు వాడుతున్నారు. నిమిషాల వ్యవధిలో ఇల్లు వెచ్చగా మార్చుకునేందుకు ఈ పరికరం బెస్ట్ చాయిస్గా మారింది. ఓవర్ హీట్ కాకుండా ఉండడం వల్ల ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగిస్తున్నారు. పూర్తిగా విద్యుత్తో నడిచే ఈ రూమ్హీటర్ నుంచి ఎలాంటి శబ్దం రాదు