నర్సంపేట, మే 30 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం అధ్వానంగా ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో సాగునీటి రంగంలో ఇరిగేషన్ సర్క్యూట్ నిర్మించామన్నారు. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. దశాబ్ది ఉత్సవాలను ప్రభు త్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. వేడుకలను జూన్ 2 నుంచి 21 రోజులపాటు వీటిని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నర్సంపేటలో అభివృద్ధి పనులను వేగవం తం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో మున్సిపల్ నిధులు రూ.5 కోట్లతో నిర్మిస్తున్న పాకాల ఆడిటోరియం పనులు చివరి దశలో ఉండగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కుమ్మరికుంట పార్క్ డిజైన్ వేయించామని, త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నర్సంపేటలో జంక్షన్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇప్పటికే పాకాల సెంటర్లో జంక్షన్ పనులు పూర్తికావొచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీరు రాని గ్రామాలను గుర్తించి, త్వరలో వచ్చేలా చేస్తామన్నారు. పట్టణంలో వెజ్నాన్వెజ్ మార్కెట్తోపాటు అంబేద్కర్ భవన్ను కూడా నిర్మిస్తామన్నారు. కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పూర్తి చేస్తామన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.220 కోట్లు మంజూరయ్యాయన్నారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల్లో పాఠశాలను ఆధునీకరించామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో వీటిని ప్రారంభిస్తామన్నారు. ఐటీడీఏ నిధులతో 137 చోట్ల రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. తండాలలోని 40 గ్రామ పంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించామన్నారు. నర్సంపేట నియోజకవర్గం అంతటా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో పోలీసు అధికారులతో పాటు, అందరూ భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి రంగం లో ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. పోలీసు శాఖ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని వాటి ని పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ కర్ణాకర్, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకండే, అదనపు కలెక్టర్ వాత్సల్య, ఎంపీపీలు వేముల ప్రకాశ్రావు, కాట్ల కోమల, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, సొసైటీ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, జడ్పీ వైస్చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.