ధర్మసాగర్ : రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల ( Bulldozers ) చుట్టే సాగుతుందని, దోచుకోవడం దాచుకోవడమే తప్ప రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి ( Rakesh Reddy ) , స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య ( T. Rajaiah ) విమర్శించారు.
ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాలలోని ఐకేపీ, పీఏసీఎస్, మార్క్ ఫెడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని నిరసన తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే నెల రోజులైన ధాన్యం విక్రయించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సద్దిమూటలతో ఎర్రటి ఎండలో కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్లు వాగులో పోతేంది, గొడ్డు గోదాట్లో పొతేందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్ల పాలనలో రైతులు ఒక్కరోజు కూడా సంతోషంగా లేరని వెల్లడించారు. రైతు సమస్యలు పట్టని సీఎం రేవంత్ రెడ్డి తొండలు పట్టడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి భూములను నమ్ముకుని బ్రతికేటోడు కాదని భూములను అమ్ముకుని బ్రతికేటోడని రైతులకు అర్థమైందన్నారు. గడ్డి వాము మీద గొడ్లు మేసినట్లు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ఖజానను దోచుకుంటున్నట్లు ఆరోపించారు. కడియంది ఐరన్ లేగ్ అని ఆయన ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే అక్కడ కేంద్రాలే మూతపడ్డాయని రాజయ్య ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరువు వస్తుందని, రైతులకు కన్నీళ్లు, కష్టాలు వస్తాయని కేసీఆర్ చెప్పినట్లే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందన్నారు. ఈనెల 6న హనుమకొండలో నిర్వహించే రైతు సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, ధర్మసాగర్ మండల ఇన్చార్జి కర్ర సొమిరెడ్డి, మండల కన్వీనర్ కొయ్యడ మహేందర్, నాయకులు చాడ విజేందర్ రెడ్డి, మారబోయిన రాజు, ప్రవీణ్, సాగర్, వెంకన్న, ఎండీ హరీఫ్, సుధాకర్, రాజు పాల్గొన్నారు.