‘రైతుభరోసా’ కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తం.. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తం..’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న ఒక హామీ.. ఇలా ప్రకటించి నెల తిరక్కముందే ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అంతా తూచ్ అని తేల్చేశాడు. తాముచెప్పిందంతా బూటకమేనని చెప్పకనే చెప్పాడు. భూ యజమాని లేదా కౌలురైతులో ఎవరో ఒకరికి మాత్రమే సాయమందిస్తామని చెప్పి కాంగ్రెస్ మాయమాటలకు అద్దంపట్టాడు. ఎన్నికలు కూడా కాకముందే మాటమార్చిన రేవంత్ తీరుపై అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఇలా పూటకోమాట మాట్లాడే కాంగ్రెస్ నేతలను ఎట్లా నమ్ముతరు?.. ఎవరు నమ్ముతరు?’ అని ప్రశ్నిస్తున్నారు.. ‘రాజకీయానికి నీకు రైతులే దొరికిండ్రా’ అని రేవంత్ను నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నేతల మాటలను నమ్మితే నిండా మునుగుడేనని చెబుతున్నారు.
వరంగల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్, (నమస్తే తెలంగాణ) : తాము అధికారంలోకి వస్తే రైతులకు అదిచేస్తాం.. ఇది చేస్తాం అని రేవంత్రెడ్డి కొడుతున్నదంతా ‘డబ్బా’నేనని తేటతెల్లమైంది. నెలక్రితం ప్రకటించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతులకు రూ.15వేలు ఇస్తామని ఉందని, ఇప్పుడేమో పెట్టుబడి సాయం భూ యజమానికి లేదా కౌలు చేసే రైతుకు మాత్రమే ఇస్తామని రేవంత్రెడ్డి అంటున్నాడని.. ఇంతలోనే మాటమార్చడం ఏమిటని రైతులు, రైతుసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన మాటలతో కాంగ్రెస్ చెప్పేదంతే బూటకమేనని తెలుస్తోందని విమర్శిస్తున్నారు. కౌలు రైతులకు కాకుండా భూ యజమానులకు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తూ వస్తోందని, ఒకవేళ ఎవరైనా కౌలుకు తీసుకుంటే సదరు భూ యజమాని ఆ డబ్బును కౌలు రైతుకు ఇవ్వొచ్చని చెబుతోందని, ఇలా బీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయంతో ఉందని, మరి కాంగ్రెస్ ఏస్టాండ్పై ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా రైతులందరికీ సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు భూ యజమానులు లేదంటే కౌలురైతులు ఎవరో ఒకరికి మాత్రమే రైతుబంధు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. రేవంత్రెడ్డి మాటలన్నీ అబద్ధాలేనని ఇలా పూటకో మాట మార్చుతున్న కాంగ్రెస్ను ఎవరూ నమ్మరని తెగేసి చెబుతున్నారు. కాంగ్రెస్ 60ఏండ్ల పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని, మళ్లీ ఇప్పుడు రైతులతో రాజకీయం చేస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రైతులకు కాంగ్రెస్ చేసిన నష్టం చాలని, ఇకపై ఆ పార్టీ మాయమాటలను నమ్మేది లేదని అంటున్నారు. ఎన్నికలు కాకముందే మ్యానిఫెస్టోలో ఉన్న హామీపై మాటమార్చడం కాంగ్రెస్కే చెల్లిందని, దీన్నిబట్టి చూస్తే ఆ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని దెప్పిపొడుస్తున్నారు.
చెన్నారావుపేట : కాంగ్రెస్ నాయకులవి బూటకపు మాటలని మరోసారి తేటతెల్లమైంది. రైతు బంధు పథకంపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇప్పుడే మాట మార్చడం చూస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ప్రకటించిన గ్యారెంటీలు నీటి మూటలని అర్థమయితాంది. అమలుకు సాధ్యం కాని హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. కౌలు రైతుకు లేదా భూ యజమాని ఇద్దరిలో ఒక్కరికే రైతు బంధు పైసలు ఇస్తానని రేవంత్రెడ్డి చెప్పడం చాలా దుర్మార్గం. అందుకే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఇలా కౌలు రైతు, యజమాని ఇద్దరి మధ్య గొడవలు సృష్టించి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నారు. కౌలు రౌతు చట్టంపై ఇప్పుడే మాట మార్చిన రేవంత్రెడ్డి తర్వాత మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం గ్యారెంటీని కూడా గాలికి వదిలేస్తారు. ఆర్టీసీని అమ్మేస్తారు. ఇలా వారు చెప్పిన పథకాలపై వారికే అవగాహన లేకుంటే ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే తెలంగాణ ప్రజల జీవితాలు ఆగమైతాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
గీసుగొండ : వ్యవసాయంపై రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పట్టాదారుడికి రైతుబంధు ఇవ్వకుండా కౌలుదారుడికి ఇస్తే భూ సమస్యలు వస్తాయి. కౌలుదారుడి కాలం పెట్టి రైతుబంధు ఇచ్చిన కొన్ని ఏండ్ల తర్వాత కౌలుదారుడే పట్టాదారుడు అవుతాడు. ధరణి వచ్చిన తర్వాతే గొడవలు బందయి ఇప్పుడిప్పుడే రైతులు సక్కగా ఉన్నారు. మళ్లీ రైతుల మధ్య గొడవలు పెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ మాటలు వింటే గ్రామాల్లో భూములు ఎవరు కౌలుకు ఇవ్వరు. చేసే వారు లేక భూములు పడావుగా మిగులుతాయి. అసలు రైతుబంధు ఎలా ఇవ్వాలో క్లారిటీ లేకుండా కాంగ్రెస్ మాట్లాడుతున్నది. గ్యారెంటీలు ఇస్తున్రు కాని వాటిని ఎలా అమలు చేస్తారో ఎక్కడా చెప్పడం లేదు. యావత్తు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నది. ప్రజలు, రైతులు జాగ్రత్తగా గమనించాలే.
ఖానాపురం : ఎన్నికల్లో కాంగ్రెస్ రైతులతో ఓట్లు వేయించుకుని మోసం చేయాలని కుట్రలకు పాల్పడుతున్నది. ఓట్ల కోసం ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేస్తున్నది. రైతులు, కౌలు రైతులకు రైతుబంధు ఇస్తమని మ్యానిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు ఎవరికన్న ఒకరికే ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతులను నట్టేట ముంచేయనుంది. రైతులందరూ కాంగ్రెస్ కపట వాగ్దానాలపై అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ పదేళ్లుగా రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రజలను ముంచి ఆస్తులు సంపాదించేందుకు కాంగ్రెస్ నాయకులు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని గెలివనిస్తే ప్రజలందరూ అథోగతి పాలవుతారు. రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతది. కేసీఆర్ పాలనే రాష్ర్టానికి మేలు చేస్తుంది.
రాయపర్తి : ఏన్నో ఏండ్ల సంది ఉప్పిడి ఉపాసం ఉంటూ తాతాముత్తాతల కాన్నుంచి వచ్చిన భూములను కాపాడుకుంటానం. నాకు ఐదుగురు ఆడపిల్లలే. బిడ్డలందరికీ వివాహాలు చేశాను. ఉన్న కొద్దిపాటి భూమిని కౌలుకు ఇచ్చి కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పైసలు, కౌలు డబ్బులతో భార్యాభర్తలం బతుకెళ్లదీస్తానం. మరి గిప్పుడు ఈ రేవంత్రెడ్డి ఇట్లా మట్లాడుతున్నడు. అధికారంలోకి వచ్చి భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకే రైతుబంధు పైకం ఇచ్చినట్లయితే మాలాంటోళ్ల పరిస్థితి ఏం కావాలే. ఎనుకటి నుంచి మేము భూములను అమ్ముకోకుండా కాపాడుకునుడే మేము చేసిన పాపమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ల పద్ధతి ఇప్పటికైనా మార్చుకోవాలి.
నర్సంపేట : రైతుబంధు పైసలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భూ యజమానికి లేదా కౌలు రైతుకు ఎవరికో ఒక్కరికి ఇస్తామనడం తగదు. ఇలా మాట మార్చడం కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై ఎన్నికలు పూర్తి కాకముందే మాట మార్చుతున్నరు. రైతులను మోసం చేస్తున్నరు. మోసపూరిత హామీలతో కుర్చీని పొందాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రైతులు ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దు. రైతులు ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాన్ని గ్రహించారు. రైతుబంధు ఇస్తున్న బీఆర్ఎస్కే ఓటేస్తాం. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే రైతులకు న్యాయం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు అండగా ఉంటం. కాంగ్రెస్ మోసాలతో ప్రజలను అన్యాయం జరుగుతుంది. గతంలోనూ రైతులకు అన్యాయం చేసింది.
రాయపర్తి : కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేయడం మూలంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అధికారం అప్పగించారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం భూ యాజమానులందరికీ రైతుబంధు సొమ్మును వేళకు ముట్టజెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేసిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల్లో పట్టాదారుల పేర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్, భూమి రకం మినహా ఎటువంటి కాలమ్లు లేవు. అటువంటప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే కౌలుదారులను ఎలా గుర్తిస్తారు. రైతులతో చెలగాటమాడిన ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు.
ఖానాపురం : రైతుబంధు పథకంపై కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని రేవంత్రెడ్డి బయటపెట్టాడు. రైతుబంధు భూమి ఉన్న రైతులు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు ఎవరి కన్నా ఒకరికే ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారు అనే స్పష్టత కాంగ్రెస్ నాయకులకు లేదు. ఇప్పుడే మాట తప్పుతున్న కాంగ్రెస్ నాయకులు రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతుబంధును అసలు అమలు చేస్తారనే గ్యారెంటీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం అడగకుండానే రైతుబంధు పథకం ఇచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే రైతులం మోసపోతాం. రైతులందరు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. రైతులను మోసం చేసే కాంగ్రెస్ పార్టీని పాతరేయాలి.