హనుమకొండ చౌరస్తా, జూన్ 18 : రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆదివారం జనగామ మండలం పెద్దపహాడ్ శివారులోని చంపక్ హిల్స్లోని క్వారీ నీటి కుంటలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, హత్య చేసిన సుఫారీ గ్యాంగ్కు చెందిన ముగ్గురిని బచ్చన్నపేట, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి ఒక కారు, మూడు సెల్ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బచ్చన్నపేటకు చెందిన ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా అలియాస్ భాసర్ ఉండగా, తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు. ఆదివారం హనుమకొండలోని వరంగల్ కమిషనరేట్లో సీపీ ఏవీ రంగనాథ్ నిందితుల వివరాలను వెల్లడించారు.
బచ్చన్నపేట గోపాల్నగర్కు చెందిన గిరబోయిన అంజయ్యకు రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యకు మధ్య భూముల విషయంలో గొడవలు తలెత్తాయి. సర్వే నంబర్ 174లోని భూములకు సంబంధించి రామకృష్ణయ్య ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశాడనే అకసుతో అతడిని హత్య చేసేందుకు అంజయ్య సిద్ధపడ్డాడు. రామకృష్ణయ్యను అంతమొందిస్తే రూ.8 లక్షలు ఇస్తానని అంజయ్య మరో నిందితుడు తిరుపతితో ఒప్పందం చేసుకున్నాడు. రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. తిరుపతి తన దగ్గరి బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా అలియాస్ భాసర్, దండుగుల రాజుతో కలిసి ఈనెల 15వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు పోచన్నపేట శివారులో రామకృష్ణయ్యను కిడ్నాప్ చేశారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు చిన్నరామన్చర్ల గ్రామ శివారులో కారు ఆపి రామకృష్ణయ్య మెడకు టవల్ బిగించి హత్య చేశారు.
అనంతరం అతడి మృతదేహాన్ని కారు డికీలో పెట్టి ఓబుల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి చేరుకొని అక్కడి క్వారీ నీటిగుంటలో పడేశారు. అకడి నుంచి బచ్చన్నపేటకు చేరుకొని రామకృష్ణయ్యను హతమార్చామని అంజయ్యకు చెప్పి కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. కాగా, విచారణలో ప్రధాన నిందితుడు అంజయ్య గతంలో తిరుపతి, రాజుతో సుభద్రను హత్య చేయించినట్లు తెలిసిందని సీపీ తెలిపారు. రామకృష్ణయ్యను హత్య చేసేందుకు గత డిసెంబర్ నుంచి నిందితులు ప్రయత్నిస్తున్నట్లు వీరి వాట్సాప్ చాట్ ద్వారా తెలిసిందని, ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. హత్య కేసును ఛేదించిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి, నర్మెట సీఐ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్, టాస్క్ఫోర్స్ సీఐ రాంబాబు, ఎస్సై దేవేందర్, శరత్, సిబ్బందిని సీపీ అభినందించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనగామ డీసీపీ సీతారాం..
జనగామ రూరల్ : జనగామ మండలంలోని చంపక్ హిల్స్ క్వారీ నీటిగుంటలో తేలియాడుతున్న రామకృష్ణయ్య మృతదేహాన్ని డీసీపీ సీతారాం, ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి, సీఐలు ఎలబోయిన శ్రీనివాస్, నాగబాబు పరిశీలించారు. అక్కడే డాక్టర్లతో పోస్ట్మార్టం చేయించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.