మునుపెన్నడూ లేని, చూడని విధంగా సర్కారు బడి సరికొత్తగా మెరిసిపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తలపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రభుత్వ బడి రూపురేఖల్ని పూర్తిగా మార్చుతున్నది. ఆకట్టుకునే నేమ్బోర్డులు, గోడలపై కళాకృతులు, ప్రహరీ, గదులకు అద్దుకున్న తీరొక్క రంగులు, టైల్స్తో ఫ్లోరింగ్ చేసిన టాయిలెట్లు, వాష్ ఏరియాలు, విశాలమైన డైనింగ్ హాళ్లు.. ఇలా సకల సదుపాయాలతో కార్పొరేట్ హంగులు అద్దుకున్నది. తొలి విడుతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,165 పాఠశాలలను రూ.338.87 కోట్లతో ఆధునీకరించింది వాటిని చూసి విద్యార్థులు మురిసిపోతుండగా, ఊరి జనం సంబురపడుతున్నది.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘనపురం పాఠశాలకు రూ.17,41,413, ఏటూరునాగారం ప్రాథమిక పాఠశాలకు రూ.10,98,203 నిధులు కేటాయించింది. వీటితో అదనపు తరగతుల నిర్మాణం, భవనాల మరమ్మతులు, తాగునీటి వసతి, ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారు.
– ఏటూరునాగారం
వెంకటాపురం (నూగూరు) మండలకేంద్రంలోని రంగరాజాపురం పాఠశాలకు రూ.8,61,124, నాయకులగూడెం పాఠశాలకు రూ.5,78,167 నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో తరగతి గదుల మరమ్మతు, ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, వంట గదుల నిర్మాణాలు పూర్తి చేశారు. పాఠశాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
– వెంకటాపురం(నూగూరు)
దేవరుప్పుల మండలంలో మాదాపురం ప్రాథమిక పాఠశాలను రూ.11.86లక్షలు, మొండిచింత తండా ప్రాథమిక పాఠశాలను 12.28 లక్షలు వెచ్చించి మోడల్గా తీర్చిదిద్దారు. తరగతి గదుల్లో మేజర్, మైనర్ రిపేర్లు, ఫ్ల్లోరింగ్, టాయిలెట్లు, నీటి సంప్, ఓవర్హెడ్ ట్యాంక్, గ్రౌండ్ లెవలింగ్, స్టీల్ రెయిలింగ్, వంట గది, వేర్వేరు టాయిలెట్లు, పాఠశాల నేమ్బోర్డు సహా సకల వసతులతో తీర్చిదిద్దారు.
– దేవరుప్పుల
పాలకుర్తి మండలం చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రూ.72లక్షలతో అందంగా తీర్చిదిద్దారు. అలాగే విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగం వైపు ప్రోత్సహించేలా ఇక్కడి ఉపాధ్యాయులు సొంతంగా రూ.20వేలతో పీఎస్ఎల్వీ-39 ఉపగ్రహ నమూనాను పాఠశాల ఆవరణలో నిర్మించారు. ఈ తరహా కట్టడం జనగామ జిల్లాలోనే మొదటిది.
– పాలకుర్తి
గీసుగొండ మండలం మొగిలిచర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ లుక్ తీసుకొచ్చింది. రూ.13,31,428 నిధులతో భవనానికి మరమ్మతులు, ఏడు గదులకు విద్యుదీకరణ, ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, లైట్లు, ఆకట్టుకునేలా గ్రీన్చాక్బోర్డు, డ్యుయల్డెస్క్ బెంచీలు, టాయిలెట్స్, హ్యాండ్వాష్, కిచెన్ షెడ్, ప్రహరీ, ట్రాక్.. ఇలా సకల సదుపాయాలతో తీర్చిదిద్దారు.
– వరంగల్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)
నల్లబెల్లి మండలం రేలకుంట ఎంపీపీఎస్ను రూ.26 లక్షలతో అభివృద్ధి చేశారు. కంపౌండ్ వాల్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, సంప్, రెండు వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్, తాగునీరు వసతి కల్పించారు. రూ.3 లక్షలతో గదుల్లో 33 టేబుళ్లు ఏర్పాటుచేశారు. మెగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలకు రంగులు వేయించారు.
– నల్లబెల్లి
హనుమకొండ లష్కర్ బజార్లోని ప్రాథమిక పాఠశాలకు రూ.15,46,393 నిధులు కేటాయించారు. వీటితో ప్రహరీ, గేటు, టైల్స్తో టాయిలెట్స్ నిర్మించి గదుల్లో 24 సీలింగ్ ఫ్యాన్లు, 5 గ్రీన్చాక్బోర్డులు ఏర్పాటు చేశారు. పెచ్చులూడుతున్న స్లాబ్, శిథిలావస్థలో ఉన్న టాయిలెట్స్కు మరమ్మతులు, డ్రింకింగ్ వాటర్ కోసం సంప్, విద్యుత్ రిపేర్లు పూర్తి చేశారు.
– హనుమకొండ సిటీ
పరకాల పట్టణంలోని వెలమవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రూ.29.98 లక్షలతో పూర్తిగా ఆధునీకరించారు. పాత భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆవరణలో కిచెన్ షెడ్, బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్, నీటి సౌకర్యం, ట్యాప్లు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం పాఠశాల భవనానికి కలర్లు వేస్తున్నారు.
– పరకాల
మహబూబాబాద్ పట్టణం హరిజనవాడలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.19,17,723 కేటాయించింది. ఈ నిధులతో ప్రహరీ, టాయిలెట్లు, డ్యుయల్ డెస్క్ బెంచీలు, బల్లలు, మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
– మహబూబాబాద్ రూరల్
భూపాలపల్లి మండలం పెద్దాపూర్లోని ఎంపీపీఎస్ ఆధునీకరణ కోసం రూ.61.58 లక్షలు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దారు. తాగునీటి సౌకర్యం కోసం సంప్, ట్యాప్స్ పెట్టారు. ప్రహరీ నిర్మించారు. 16 చొప్పున ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అమర్చారు. అలాగే వంట గది, మరుగుదొడ్లు మూడు యూనిట్లు, మేజర్ మైనర్ మరమ్మతులు పూర్తిచేసి పాఠశాల మొత్తం పెయింటింగ్ వేసి ఆకట్టుకునేలా స్టేజీ నిర్మించారు. డ్యూయల్ డెస్క్లు వచ్చాయి.
– జయశంకర్ భూపాలపల్లి, జనవరి 30(నమస్తే తెలంగాణ)
కాటారం మండలం గంగారంలో ఒకే క్యాంపస్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు రూ.40లక్షలు మంజూరుచేసింది. వీటితో డైనింగ్హాల్, వంట గది, ప్రహరీ నిర్మించడంతో పాటు తాగునీరు, విద్యుదీకరణ సహా సౌకర్యాలు కల్పించారు. అలాగే మేజర్, మైనర్ మరమ్మతులు పూర్తి చేసి పాఠశాల అంతటా పెయింటింగ్ వేయడంతో కళకళలాడుతోంది.
– జయశంకర్ భూపాలపల్లి, జనవరి 30(నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.49 లక్షల నిధులు కేటాయించారు. వీటితో పాఠశాలకు రంగులు, నేమ్బోర్డు, తరగతి గదులకు మరమ్మతు పనులు చేసి సకల వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
– పెద్దవంగర