పర్వతగిరి, జనవరి 6 : కాకతీయుల కాలంలో నిర్మించిన పర్వతగిరి శివాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 26, 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునఃప్రతిష్ఠాపన చేస్తున్నామని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి జలంతో శివుడికి అభిషేకం చేయాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం మెట్లు ఎక్కి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి శుక్రవారం జిల్లా శాఖ అధికారులతో శివాలయం వద్ద సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లో బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ అధికారులను కోరారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగిన బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గుట్ట మీదకు వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శివాలయం కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి విడుదల చేశారు. జాతర సందర్భంగా గాయకులు సునీత, మంగ్లీ, మధుప్రియను రప్పించే ప్రయత్నం చేయాలని నిర్వాహకులకు సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ కోసం పోలీసులు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. జాతర కరపత్రాలను చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు పంపిణీ చేసి జాతరకు ఆహ్వానించాలని సూచించారు.
కాకతీయుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా నిర్వహించనున్న ఈకార్యక్రమాలను విజయవంతం చేసి, శివుడి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. సమీక్షలో ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు, ఎంపీపీ కమలాపంతులు, జడ్పీటీసీ సింగ్లాల్, నాయకులు మనోజ్కుమార్గౌడ్, మేడిశెట్టి రాములు, సర్పంచ్లు మాలతీసోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, సర్వర్, గోనె సంపత్, ఎల్లావుల లలితాయాదవ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.