నర్సంపేటరూరల్, డిసెంబర్ 2: యాసంగి వరి సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. చెరువులు, కుంటల కింద కూడా రైతులు నారు మడుల తయారీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో నారు మడులను తయారు చేయడంలో రైతులు నిమగ్నమయ్యారు.
సుమారు 300 హెక్టార్లల్లో బావులు, బోర్ల వద్ద యాసంగి వరి నాట్లు వేయనున్నారు. కొందరు రైతులు వ్యవసాయ పొలాల్లో నారు మడులు తయారు చేస్తుండగా, మరికొందరు అన్నదాతలు ఇంటి వద్ద మండె లు కట్టి వడ్లు అలుకుతున్నారు. ఇదిలా ఉంటే.. చెరువులు, కుంటల కింద వరి కోతలు సగానికి పైగా పూర్తయ్యాయి. ప్రధానంగా అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న మాదన్నపేట పెద్ద చెరువులో నీరు ఇప్పటికీ మత్తడి సమీపానికి చేరుకొని ఉంది. దీంతో రైతులు యాసంగి వరి నాట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.