వరంగల్, జనవరి 28 : రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగడంతో నగరంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనేక వర్గాలు మొగ్గుచూపుతున్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక విజన్తో మాస్టర్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తోంది. ఇటు నగరానికి మణిహారంగా ఉన్న ఇన్నర్, ఔటర్రింగ్ రోడ్ నిర్మాణంతో శివారు ప్రాంతాలు పట్టణ శోభను సంతరించుకున్నాయి. ఇలా నగరంలోనే గాక శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండడంతో రియల్టర్లు వరంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
నగరం చుట్టూ ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో రియల్ రంగం ఊపందుకుంది. జాతీయ రహదారుల అనుసంధానంతో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారితో ములుగు వైపు, జగిత్యాల-కోదాడ జాతీయ రహదారితో ఖమ్మం వైపు భూములకు రెక్కలు వచ్చాయి. మామునూరు వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో వరంగల్లో రియల్ వ్యాపారం బంగారంగా మారుతోంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఇంటి స్థలం కొనాలనే వారు ఇప్పుడు వరంగల్లో స్థలం కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే నగరాన్ని పక్కా ప్రణాళికలతో అభివృద్ధి చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లో రింగ్ రోడ్ల చుట్టూ కమర్షియల్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికార యంత్రాంగం ఓఆర్ఆర్ చుట్టూ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎంటైర్టైన్మెంట్ పార్క్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు వచ్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నగరం మధ్యలో ఓ సిటీ, నగర శివారులో మా సిటీ, యుని సిటీ పేరిట కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చేసిన వెంచర్లకు విశేష ఆదరణ వచ్చింది. ఊహించని విధంగా ధరలు పలికాయి. దీంతో పాటు నగర శివారుల్లో ప్రైవేట్ సంస్థలు చేస్తున్న వెంచర్లు సక్సెస్ అవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ వెంచర్లు చేయడానికి ముందుకు వస్తున్నాయి.
మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు నగరంలో పుంజుకుంది. దీంతో అనేక మంది వెంచర్ డెవలపర్స్గా, బిల్డర్స్గా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఆధునిక వసతులతో అపార్ట్మెంట్లే కాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాస్ను బిల్డర్స్ నిర్మిస్తున్నారు.
నగరంలో రియల్ బూమ్తో కన్స్ట్రక్షన్ రంగంలో వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ఇక్కడి వారితో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన సుమారు పది వేల మంది కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా. ఇటుక నుంచి ఇంటీరియర్ వరకు వేలాది మంది నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
బ్యాంకులు ఇచ్చే హౌసింగ్ లోన్లతో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. వంద గజాల స్థలం ఉంటే చాలు బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తక్కువ వడ్డీకే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు హౌసింగ్ రుణాలు అందిస్తుండడంతో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. దీంతో ఇసుక, ఇటుక, స్టీల్, సిమెంట్, పెయింట్స్, ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.
నగరంలో రియల్ ఎస్టేట్కు మంచి మార్కెట్ ఉంది. ఫ్యూచర్ సిటీగా ఎదుగుతున్న వరంగల్లో వివిధ జిల్లాలకు చెందిన వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక నగరంగా ఎదిగే అవకాశం ఉన్న వరంగల్లో ఇప్పటి వరకు చేసిన వెంచర్లు విజయవంతమయ్యాయి. నగరం చుట్టూ జాతీయ రహదారులు అనుసంధానం కావడం, టెక్స్టైల్ పార్కులు, రైల్వే సంబంధిత ప్రాజెక్టులు రావడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు వచ్చింది.
డీసీసీబీ నుంచి హౌసింగ్ రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ భూములను మార్టిగేజ్ చేసుకుని హౌసింగ్ రుణాలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతం వారికి రూ.30 లక్షలు, మండల కేంద్రంలో రూ. 50 లక్షలు, నగరంలో ఇంటి స్థలాలపై రూ. 70 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నాం.