ఖిలావరంగల్, జనవరి 27: మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నగరాన్ని మరిపించేలా అన్ని రకాల వసతులను విలీన గ్రామాల్లో కల్పిస్తుండడంతో ప్రజలు తమ ఆలోచనకు అద్దం పట్టేలా మహానగరంలో నిర్మితమవుతున్న సుందర భవనాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
గ్రామాల మధ్య బీటీరోడ్లు, గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలతో శివారు పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు పడుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బొల్లికుంట, గాడిపల్లి, వసంతపురం, స్తంభంపల్లి, ఆదర్శనగర్, ముస్కులపల్లి, రామకృష్ణపురం, సాయినగర్ గ్రామాలు గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లో ఉన్నాయి. మహానగర పాలకసంస్థలో విలీనం తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. దినదినాభివృద్ధితో విలీన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బొల్లికుంటలో నాలుగు కమ్యూనిటీ భవనాలకు రూ. 1.80 కోట్లు కేటాయించారు. రూ. 20 లక్షలతో రైతు వేదిక భవనం, రూ. 10 లక్షలతో పశువైద్యశాల, రూ. 50 లక్షలతో డ్వాక్రా సంఘాల భవనం, రూ. 10 లక్షలతో పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి శంకుస్థాపన చేశారు. పలు నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. అలాగే, వసంతపురంలో రూ. 1.68 కోట్ల నిధులతో అంతర్గత సీసీరోడ్లు నిర్మించారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. రూ. 35 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. డివిజన్లో అతి చిన్న గ్రామం స్తంభంపల్లి. ఈ గ్రామాభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయించగా, ఇందులో రూ. కోటితో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మించారు. అలాగే, ధర్మారం రైల్వేగేటు నుంచి స్తంభంపల్లి వరకు బీటీరోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాకుండా రూ. 22 లక్షలతో రైతువేదిక నిర్మాణం పూర్తి చేశారు.
విలీన గ్రామాల్లో సౌకర్యాలు ఫుల్..
విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో నగరాన్ని తలపించేలా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. దూపకుంటలో కమ్యూనిటీ భవనానికి రూ. 15 లక్షలు, మహిళా సంఘం భవనానికి రూ. 50 లక్షలు కేటాయించారు. వసంతపురం, నక్కలపల్లి, తూర్పుకోట నుంచి దూపకుంటకు బీటీరోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ధర్మారం నుంచి దూపకుంట మీదుగా కాపులకపర్తి వరకు డబుల్రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. గాడిపల్లిలో కూడా అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. రెండు వీధులు మినహా ఊరంతా రూ. 74 లక్షల నిధులతో సీసీరోడ్డు వేశారు. దూపకుంట నుంచి గాడిపల్లికి, వసంతపురం నుంచి గాడిపల్లి వరకు రూ. 1.80 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అలాగే, రూ. 1.20 కోట్ల నిధులతో గుంటూరుపల్లి, నల్లకుంట నుంచి గాడిపల్లి వరకు రెండు బీటీరోడ్లను నిర్మించారు. కార్పొరేటర్గా గద్దె బాబు డివిజన్ అభివృద్ధికి రూ. 13 కోట్లు మంజూరు చేయించగా, ఇందులో రూ. 9 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే, ఆదర్శనగర్ నుంచి స్తంభంపల్లి వరకు నాలుగు లేన్ల రోడ్డు పనుల్లో వేగం పుంజుకుంది. సమస్యల లోగిళ్ల నుంచి అనతికాలంలో బయటపడిన విలీన గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.