కమలాపూర్, సెప్టెంబర్ 24 : మూడో రైల్వే లైన్ పనుల పేరుతో రైల్వే అధికారులు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కాజీపేట-బల్లార్షా ప్రధాన రైలు మార్గం కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. మరమ్మతుల పేరిట సుమారు రెండు నెలలుగా సింగరేణి, రామగిరి, అజ్ని ఎక్స్ప్రెస్, కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు రైలు ప్రయాణం శాపంగా మారింది. రైల్వే అధికారులు ఇష్టానుసారంగా రైళ్ల రద్దును పొడిగిస్తున్నా అడి గే నాథుడే కరువయ్యాడు. ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల ను కలిపే ప్రదాన రైలుమార్గం కావడంతో ఉప్పల్ నుంచి ప్రజలు సింగరేణి ప్రాంతాలైన రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్ వెళ్లేందుకు రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తుండడంతో రద్దీ భారీగా ఉంటోంది. భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు సమయపాలన పాటించకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గమ్యానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్పందించని బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ..
మూడు ప్యాసింజర్, ఒక ఎక్స్ప్రెస్ రైలును నెలల తరబడి రద్దు చేస్తున్నా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లు ఉన్నా రైళ్ల రద్దుపై రైల్వే అధికారులను అడిగిన దాఖలాలు లేవనే చర్చ జరుగుతోంది. ప్రజల కోసం పనిచేస్తున్నామని ఊదరగొడుతున్న ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రయాణికులు నిలదీస్తున్నారు. కాజీపేట-బల్లార్షా సెక్షన్లో పెద్దపల్లి, మంచిర్యాల, ఎల్లాపూర్, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూరు, పెద్దపల్లి, రాఘవపూర్, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో రైళ్ల రద్దుతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కాజీపేట-విజయవాడ రైలు మార్గంలో మూడోలైను పనులను వారం రోజుల్లో పూర్తి చేసి రైళ్లను నడుపుతున్నారు. కానీ కాజీపేట-బల్లార్షా రైలు మార్గంలో రైళ్ల రద్దు నెలల తరబడి పొడిగిస్తూ పోతున్నారనే విమర్శలున్నాయి.
రైళ్లను వెంటనే పునరుద్ధరించాలి..; తుర్పాటి ఉపేందర్, ఉప్పల్
రద్దు చేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలి. రద్దు పొడిగింపుతో ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రైళ్ల రద్దుపై రైల్వే అధికారులను నిలదీయాలి. బస్సుల్లో వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతుండడంతో పాటు డబ్బులు ఖర్చు అవుతున్నయి. ఆటో కార్మికులు, హోటల్ నడిపేవారు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డా వివక్ష పోవడం లేదు..; ఎర్రబెల్లి సంపత్రావు, ఎంపీటీసీ, ఉప్పల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా వివక్ష పోవడం లేదు. రాష్ట్రంలో కాజీపేట-బల్లార్షా మార్గంలో ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో నడిచే ఐదు ఎక్స్ప్రెస్, ఒక సూపర్ఫాస్ రైలులో నాలుగింటిని రద్దు చేసి, కేవలం భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను బెల్లంపల్లి వరకే నడుపుతున్నారు. ఆంధ్రకు గంటకో రైలు ఉంటది.. తెలంగాణలోని సింగరేణి ప్రాంతాలకు వెళ్లేందుకు ఉదయం, సాయంత్రం ఒకటి మాత్రమే రైలు ఉంటున్నది.