వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 22: అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి మంగళవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులోని ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించింది. బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో తనకు చాతి, తల నొప్పి ఉందని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని వైద్య సిబ్బందికి కేటాయించిన గదిలోకి వెళ్లింది. ఉదయం 6.30 గంటలకు తోటి వైద్యులు గదిలోకి వెళ్లే సమయానికి ప్రీతి అచేతనంగా పడివుండడాన్ని గుర్తించి వెంటనే వైద్యాధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆర్ఐసీయూ విభాగంలో వైద్యసేవలు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు ప్రీతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి ప్రత్యేక వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో నిమ్స్కు తరలించారు.
సీనియర్ వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు
బాధితుకాలి కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురును పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సైఫ్ వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తనను సీనియర్ వేధింపులకు గురి చేస్తున్నాడని సమాచారం ఇవ్వడంతో రైల్వేలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న తండ్రి నరేందర్ తన మిత్రుడైన పోలీస్ అధికారితో ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాడని తెలిపారు. అధికారులు వెంటనే స్పందిస్తే ఇతంటిఘోరం జరిగేది కాదంటున్నారు. దీనిపై విలేకరుల సమావేశంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ సంబంధిత విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డితో మాట్లాడి పూర్తి సమాచారం అందించాలని కోరారని తెలిపారు. విభాగాధిపతి ఇరువురిని పిలిపించి మాట్లాడారని అన్నారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆపరేషన్లు చేయాల్సివున్న రోగుల కేస్ షీట్స్ హౌజ్సర్జన్లతో రాయించినందుకుగాను సీనియర్ విద్యార్థి బాధితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తేలడంతో ఇరువురిని వివరణ కోసం ప్రిన్సిపాల్ని కలవాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయంలో తాను ప్రిన్సిపాల్ని తరువాత కలుస్తానని బాధితురాలు వెళ్లిపోయిందని, ఈ విషయాన్ని ప్రిన్సిపాల్కు విభాగాధిపతి వివరించారని తెలిపారు. వివాదం పెరగకుండా ఇద్దరికి వేర్వేరుగా విధుల కేటాయించాలని సూచించినట్లు తెలిపారు. అప్పటి నుంచి మూడు రోజులుగా విధుల కేటాయింపులో మార్పులు చేశారన్నారు. ప్రీతి వినియోగిస్తున్న హాస్టల్ గదిలోకి ఎవరినీ అనుమతించొద్దని వార్డెన్ను ఆదేశించామని కేఎంసీ ప్రిన్సిపాల్ తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని వివరించారు.
ఆత్మహత్యాయత్నంపై ఆధారాలు లభించలేదు : ఎంజీఎం సూపరింటెండెంట్
ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయంలో తమకు ఆధారాలు లభించలేదని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ విలేకరులతో తెలిపారు. ప్రీతి అపస్మారకస్థితిలో పడివున్న విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారుల బృందం స్పందించిందన్నారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మట్టెవాడ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. బాదితురాలు అపస్మారకస్థితిలో పడివున్న ప్రాంతంలో ఆధారాల కోసం పోలీసులు పరిశీలించారని అన్నారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయంలో తగిన ఆదారాలు లేవని, బాధితురాలు సొంత వైద్యం కోసం ఏమైనా ఇంజక్షన్ తీసుకుందా అనే కోణంలో పరిశీలించామన్నారు. ఆమె రక్త నమూనాలు సేకరించి పరీక్షలు సైతం చేశారన్నారు. అలా చేసివుంటే విరుగుడు మందును అందించడానికి ప్రయత్నించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కి తరలించామని అన్నారు.
పోలీసు విచారణకు సహకరిస్తాం
ప్రీతి విషయంలో పోలీసు విచారణకు తాము పూర్తిగా సహకారిస్తామని, ఎంజీఎంలో జరిగిన ఘటనపై శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులుంటే చర్యలు తీసుకుంటామని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. బాధితురాలు థైరాయిడ్, కీళ్లవాతంతో బాధపడుతున్నదని కుటుంబసభ్యులు తెలిపిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యం కోసం ఏమైనా ఇంజక్షన్ తీసుకుందా లేక ఇంకెవరైనా ఇంజక్షన్ చేశారా, లేదా వికటించి ఇలా జరిగిందా అనే అంశాలపై ప్రత్యేక వైద్యబృందంతో విచారణ జరుపుతామని తెలిపారు. వేధింపులే కారణమని ఆరోపణల నేపథ్యంలో మరో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపుతామని, సెల్ఫోన్ డా టాను సైతం పరిశీలిస్తామన్నారు. ప్రీతి ఆత్మహ త్యాయత్నానికి వేధింపులేనని తేలితే ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం భాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేఎంసీలో జూనియర్ వైద్య విద్యారులపై సీనియర్లు వేధింపులకు పాల్పడుతున్నారనే విషయంలో వాస్తవం లేకపోలేదని వైద్య విద్యార్ధులు చర్చించుకోవడం కొసమెరుపు.
విద్యార్థి సంఘాల ఆందోళన
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకతీయ మెడికల్ కళాశాల ముందు పలు విద్యార్థిసంఘాలు ఆందోళన నిర్వహించాయి. వైద్యు వృత్తిని ఎంచుకొని విద్యాభ్యాసం చేస్తున్న డాక్టర్ అచేతనస్థితికి చేరుకోవడానికి కారకులను గుర్తించి శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దీనిపై విచారణ జరుపకుండా సీనియర్ విద్యార్ధులను దోషులలుగా ప్రచారం చేయడం సరైందికాదని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై విచారణకు తమ వంతు సహకారం అందిస్తామని, బాధ్యులను గుర్తించి చట్ట పరంగా చ ర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితురాలి తల్లిదండ్రులకు అండగా ఉంటామని తెలిపారు.