కాశీబుగ్గ, ఏప్రిల్ 10 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతుల కష్టాన్ని కొందరు చిల్లరగాళ్లు దోచుకుంటున్నారు. ఎండనకా..వాననకా..ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి మార్కెట్ యార్డుల్లో భద్రత కరువైంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు యువకులు, మహిళలు, కార్మికులు బస్తాల మిర్చిని చోరీ చేస్తుండగా, మాటల్లో దింపి కొందరు.. ధర్మం పేరుతో మరికొందరు దోపిడీ చేస్తున్నారు. చిల్లర దందాను కొందరు అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చియార్డులో చిల్లర దందా జోరుగా సాగుతున్నది. యార్డులో వంద మందికి పైగా మహిళలు, యువకులు, వివిధ కార్మికులు రైతులు తెచ్చిన బస్తాల నుంచి మిర్చిని చోరీ చేస్తున్నారు. మరికొందరు కిందపడిన మిర్చిని ఏరుకుంటున్నారు. అలాగే, హమాలీ, గుమస్తా, దడువాయి కార్మికులు ధర్మం పేరుతో దోపిడీ చేస్తున్నట్లు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరికొందరు రైతులను మాటల్లోకి దించి బస్తాల వెనకవైపు కిందపడిన మిర్చిని ఏరుకుంటున్నట్లు చేసి బస్తాల నుంచి పెద్ద ఎత్తున చోరీ చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.
దీనిపై యార్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కార్మికులు కటింగ్, నంబరింగ్ చేసినందుకు చార్జీలు వసూలు చేస్తున్నా, మళ్లీ రైతుల నుంచి మిర్చిని బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. మిర్చి బస్తాల తూకం వేసే సమయంలోనూ అక్కడి కార్మికులతో చిల్లర గాళ్లు కుమ్మక్కై మిర్చిని తస్కరిస్తున్నారు. ఇలా సేకరించిన మిర్చిని యార్డులోనే చిల్లర కొనుగోలుదారులకు అమ్ముకుంటున్నారు. ఒక్కో చిల్లర కొనుగోలుదారుడు రోజుకు 10 నుంచి 20 బస్తాల మేర మిర్చిని సేకరిస్తున్నారంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఇలా కొనుగోలు చేసిన వాటిని కొందరు వ్యాపారులు ఎలాంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా కొనుగోలు చేసి మార్కెట్ నుంచి మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో రైతులు నిత్యం నిలువు దోపిడీకి గురై ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే, మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయానికి గండి పడుతుందని, ఇప్పటికైనా మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్కు వచ్చే రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో వరంగల్ వ్యవసాయ మార్కెట్కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి యార్డులో చిల్లర కొనుగోలుదారులను అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు బహిరంగంగానే పలువురు ఆరోపిస్తున్నారు.
మిర్చియార్డులోని గద్దెలపై ఉన్న మెట్ల కింద షెటర్లను అధికారులే వారికి అప్పగించారని, ఇందుకుగాను వారం వారం మామూళ్లు తీసుకుంటున్నారని చిల్లర వ్యాపారులే చెబుతున్నారు. గతంలో అధికారులు ఈ చిల్లర దందాలను కట్టడి చేసేవారు. ప్రస్తుతం మార్కెట్లో ఆ పరిస్థితి లేదు. చిల్లర దందా జోరుగా సాగుతున్నది. నిజానికి కింద పడిన మిర్చిని ఏరుకోవాలనుకుంటే యార్డులో క్రయవిక్రయాలు పూర్తయి రైతులు వెళ్లిపోయిన తర్వాతనే ఏరుకోవాలి. కానీ, మార్కెట్లో ఇలా జరగడం లేదు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చోరీకి తెగబడుతున్నారు.