నమస్తే తెలంగాణ నెట్వర్క్: వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్వో గోపాల్రావు, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్కుమార్, మాస్ మీడియా అధికారి అనిల్, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ పాల్గొన్నారు. పరకాలలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
అలాగే, శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజీ వద్ద పల్స్పోలియో కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. కాగా, సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో, నగరంలోని 49వ డివిజన్ ప్రకాశ్రెడ్డి పేట ఐడియల్ హై స్కూల్ ప్రాంగణంలో పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పోలియో చుకలు వేశారు. అలాగే, అన్ని డివిజన్లు, మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు.