జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపేందుకు మంత్రి రామన్న శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం పర్యటించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రూ.126.75కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు, జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలాల్లోని మొత్తం 30 గ్రామాలకు సాగునీరందించేందుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మూడు ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద రూ.11 కోట్లతో పనులకు, ఆర్అండ్బీ పరిధిలో రూ.8.41 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.4కోట్లతో చేపట్టే రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షోడాషపల్లికి వచ్చిన అమాత్యుడు కేటీఆర్కు పల్లా ఆధ్వర్యంలో బోనాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, గిరిజనుల నృత్యాలతో ఘనస్వాగతం పలికారు.
వేలేరు/ధర్మసాగర్,ఫిబ్రవరి 27 : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలం షోడాషపల్లిలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం పర్యటించారు. మొత్తం రూ.126.75కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు, జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలాల్లోని మొత్తం 30 గ్రామాలకు సాగునీరందించేందుకు మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.104కోట్లతో చేపట్టే ఈ పనులతో 30 గ్రామాల్లోని 6,790 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరందనుంది. రూ.65 కోట్లతో గండిరామారం వద్ద చేపట్టే లిఫ్ట్తో 14 గ్రామాల్లోని 3,350 ఎకరాలకు, రూ.9.70కోట్లతో గుండ్లసాగర్ వద్ద చేపట్టే పనులతో ఆరు గ్రామాల్లోని 1,620 ఎకరాలకు, రూ.31.40 కోట్లతో నష్కల్ రిజర్వాయర్ వద్ద చేపట్టే పనులతో పది గ్రామాల్లోని 1,820 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది. దేవాదుల లిఫ్ట్ పనులతోపాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద రూ.11కోట్లతో చేపట్టే పనులకు, ఆర్అండ్బీ పరిధిలోని రూ.8.41కోట్లతో చేపట్టే రోడ్లకు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.4కోట్లతో చేపట్టే మరమ్మతులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
మున్సిపాలిటీగా స్టేషన్ ఘన్పూర్
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చుతామని మంత్రి రామన్న ప్రకటించారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించినట్లుగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కోసం చేయాల్సిన పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. స్టేషన్ ఘన్పూర్లో జనరల్ డిగ్రీ కాలేజీ, ధర్మసాగర్, వేలేరు, తరిగొప్పుల, నర్మెట, జనగామ రోడ్డును డబుల్లైన్గా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.
పల్లా ఆధ్వర్యంలో చేరికలు
ఎమ్మెల్సీ పల్లా ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ ఎంపీటీసీ ఇట్టబోయిన సంధ్యా భూపతిరాజు, కాంగ్రెస్ ఎంపీటీసీ బత్తుల జ్యోతీనిరంజన్, బీఎస్పీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుట్టి సురేష్ తో పాటు 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
మంత్రి కేటీఆర్కు పల్లా ఆధ్వర్యంలో బోనాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, గిరిజనుల నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు, యువకులు, గిరిజనులు బీఆర్ఎస్ జెండాలను చేతిలో పట్టుకుని నృత్యం చేశారు.
సభకు పోటెత్తిన ప్రజలు
ఎమ్మెల్సీలు పల్లా, కడియం, ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. వేలేరు మండలమంతా గులాబీమయమైంది. భారీ జన సందోహంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభకు సుమారు రెండు కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు.
భారీ ఏర్పాట్లు
సభకు హాజరైన వారికి ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మజ్జిగ, మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎండ తగలకుండా జర్మనీ టెక్నాలజీతో కూడిన టెంట్లు వేశారు. దాదాపు వంద మందికిపైగా బీఆర్ఎస్ వలంటీర్లు సేవలందించారు. గాయకుడు సాయిచంద్ బృందం పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు సభా ప్రాంగణంలో మహిళలు, యువకులు కేరింతలు కొట్టారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అంతా తానై రైతు కృతజ్ఞత సభను విజయవంతంగా నిర్వహించారు.