హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 29: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మూలంగా నిరాయుధులైన ఆదివాసీలు, మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు సాధారణ జీవితం గడపలేక భయాందోళనలు చెందుతున్నారన్నారు.
తాగునీరును కూడా సేకరించుకోలేని దీనస్థితిలో చనిపోయేస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి సైనిక చర్యను నిలిపి వేసి, ఆదివాసి ప్రాంతంలో అభివృద్ధిని స్థాపించేందుకు వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. నేడు ములుగులో జరిగే శాంతి ర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి, జిలుకర శ్రీనివాస్, మాదాసి సురేష్, బొట్ల బిక్షపతి, కొండ్ర నర్సింగరావు, జైసింగ్ రాథోడ్, నున్న అప్పారావు, సిద్ధమైన లక్ష్మీనారాయణ, తెలంగాణ కొమురయ్య, ఐతం నగేష్, బాదావత్ రాజు, అజ్మీర వెంకట్, సిద్దిరాజు యాదవ్ పాల్గొన్నారు.