వరంగల్ చౌరస్తా, జూన్ 13 : కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీతోపాటు ఎంజీఎం ఆస్ప్రతి రోగులు అంబులెన్స్లో అష్టకష్టాలు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అత్యవసర విభాగం లేకపోవడంతో ఎంజీఎంహెచ్ క్యాజువాలిటీలో చేర్పించి మరుసటి రోజు తిరిగి అంబులెన్స్లో తరలించి, ఆయా వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు. అలాగే ఎంజీఎంహెచ్లో అందుబాటులో లేని యంత్ర పరికరాల ద్వారా నిర్వహించాల్సిన పరీక్షల కోసం రోగులు, క్షతగాత్రులను అంబులెన్స్లో సూపర్ స్పెషాలిటీకి తరలిస్తున్నారు.

వీరిలో 2డీ ఈకో, డయాలసిస్, ఆర్ధోకు సంబంధించి స్కానోగ్రఫీ పరీక్షల రోగులే ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అంబులెన్స్లో సామర్థ్యానికి మించి తీసుకెళ్తుండడంతో రోగులు, క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికే విరిగిన ఎముకలకు కట్లు కట్టుకొని అంత మందితో అటూ, ఇటూ పరీక్షల కోసం ప్రయాణించడం కష్టంగా ఉందని, నొప్పులను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పరీక్షలు కావడంతో ముందుగా పూర్తి చేసుకున్న వారు ఇతరుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నదంటున్నారు. తీరా ఆస్పత్రికి వెళ్లే సరికి వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, దీంతో వైద్య సేవలు అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఎంజీఎంహెచ్లో అవసరమైన యంత్ర, పరికరాను, సూపర్ స్పెషాలిటీలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలని రోగులు, క్షతగాత్రులు కోరుతున్నారు.