గణపురం, జూన్ 24 : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) టీజీపీఈజేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐదో రోజైన బుధవారం సైతం విద్యుత్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు.
కార్యక్రమంలో అన్ని యూనియన్ల ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రూ. 235 కోట్ల వ్యయంతో నిర్మించిన వైటీపీఎస్ బొగ్గు, బూడిద విభాగాల ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. టెండర్ ను రద్దు చేయకపోతే భవిష్యత్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.