వరంగల్చౌరస్తా, ఏప్రిల్17 : వైద్యవిద్య పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించాలని, వైద్య కళాశాలను పట్టి పీడిస్తున్న ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వైద్యవిద్యను నగదుతో తూకం వేసి అమ్మకం జరుపుతున్న తీరుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వైద్యవిద్య కోర్సు కాలపరిమితి నాలుగున్నర సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాల కాలపరిమితిని లెక్కకడుతూ అక్రమంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయని అన్నారు. దీంతో బీ, సీ కేటగిరీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల నుంచి రూ.6 నుంచి రూ.12 లక్షల అదనంగా వసూలు చేస్తున్నారని, ఏ క్యాటగిరీ విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు రూ.60వేలు చెల్లించాల్సి ఉండగా, ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షా 50వేల నుంచి రూ.రెండున్నర లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమ వసూళ్ల దందా మొత్తం సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ విషయంపై ఫీ రెగ్యులేటరీ కమిటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని, కళాశాలలు ఎక్కువగా రాజకీయ నాయకులు, వారి అనుచరులవి కావడంతో తమకు న్యాయం జరగడం లేదన్నారు. వైద్యకళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, ఇటీవల హైదరాబాద్లో ఓ మెడికల్ విద్యార్థి ర్యాగింగ్కు బలైందన్నారు.
ఇకనైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించాలని, ర్యాగింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డిని కలిసి సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, కళాశాలల వారీగా వార్షిక ఫీజుల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరుస్తామని, అదనపు వసూళ్లకు పాల్పడిన కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ దుర్గాప్రసాద్, పానుగుల్ల సుజాత, స్వప్న గౌడ్, మధు, యాదగిరి, సంధ్యారాణి, జైపాల్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.