వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 2: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతో ప్రభుత్వ ప్రసూతి వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీంతో సీకేఎం హాస్పిటల్లో సామర్థ్యానికి మించి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం బెడ్స్ కొరత ఏర్పడుతున్నది. వైద్యాధికారులు ఈ సమస్యను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఎమ్మెల్సీ నిధుల నుంచి సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి ఆధునిక బెడ్స్ కొనుగోలుకు అనుమతి పత్రాలు అందజేశారు.
గురువారం హైదరాబాద్కు చెందిన సాయి ఎంటర్ప్రైజెస్ సంస్థ తీసుకొచ్చిన నమూనా బెడ్ను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాకుమారి వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. హాస్పిటల్ అవసరాలకు తగినట్లు ఉండడంతోపాటు గర్భిణులు, బాలింతలకు అనుకూలంగా ఉండే బెడ్స్ను మాత్రమే కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. 60 బెడ్స్ను సమకూర్చుకోనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇవి అందుబాటులోకి వస్తే మంచాల కొరత తీరుతుందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.