జనగామ, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/ నర్మెట, తరిగొప్పుల : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ పాదయాత్ర వేదికగా కొమ్మూరి, పొన్నాల వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇద్దరు నేతలు ఎవరికి వారే తమ వర్గీయులతో బలప్రదర్శనతో స్వాగతం పలికేందుకు పోటీపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. నినాదాలు.. ప్రతి నినాదాలు.. తీవ్ర తోపులాటకు దిగిన కార్యకర్తలు నువ్వెంత అంటే నువ్వెంత..నర్మెటకు రా నీ సంగతి చూస్తా.. అంటే జనగామకు రా నీ అంతు చూస్తా అంటూ చొక్కాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ తర్వాత కొమ్మూరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పొన్నాల చేయి పట్టుకొని భట్టి పాదయాత్రను కొనసాగించడంతో ఆయన వర్గం వేరుగా వెళ్లి భోజనం చేశారు. భట్టి విశ్రాంతి శిబిరంలో పొన్నాల సహా మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములూనాయక్ తదితరులు కూర్చోని ఉండగా కొమ్మూరి తన అనుచరులతో అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పొన్నాల వర్గీయులు అడ్డుకొని నెట్టేశారు.
ఒక దశలో ఇరువర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగి పరస్పరం దాడి చేసుకోవడంతో మరోసారి పోలీసులు కలుగజేసుకొని కొమ్మూ రి వర్గీయులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొమ్మూరి లేకుండానే పొన్నాలతో కలి సి భట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు. సాయం త్రం యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే కొమ్మూరి వర్గీయులు భట్టి యాత్ర ముందుకు సాగకుండా రోడ్డుపై అడ్డు గా ఉండి తమ నాయకుడిని ఎందుకు పక్కన బెట్టారంటూ వాదనకు దిగడంతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కొమ్మూరి లేకుండా పాదయాత్ర కొనసాగితే గొడవలు పెద్దవయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారి చేసిన సూచనతో భట్టి కొద్దిదూరం కొమ్మూరితో కలిసి వెళ్లడంతో పొన్నాల వర్గీయులు ఆయనను వెనక్కినెట్టారు. అయితే ఈ రోజు రాత్రికి నర్మెట చేరుకోవాల్సిన భట్టి పాదయాత్ర పొన్నాల, కొమ్మూరి వర్గీయుల పంచాయతీతో సాయంత్రం విశ్రాంతి శిబిరం నుంచి ఆలస్యంగా ప్రారంభమైంది.
ఉదయం నుంచి రాత్రి వరకు ఇరువర్గాల తోపులాట..దూషణలకు దిగడంతో తొలిరోజు పీపుల్స్మార్చ్ యాత్ర ఆద్యంతం రసాభాసగా ముగిసింది. భట్టి రాకకు ముందే రెండువర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించుకొని, బలప్రదర్శనలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైంది. ఇద్దరు ఉన్నతస్థాయి నా యకులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ వర్గపోరు తెరలేపడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఏ నాయకుడి దగ్గరికి వెళ్లితే మున్ముందు ఎలాంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పాదయాత్రతో నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ రెండు ముక్కలుగా చీలిపోయింది.
పసలేని సీఎల్పీ పాదయాత్ర
స్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పాదయాత్ర శుక్రవారం స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం లింగంపల్లి కొమ్ముగుట్ట నుంచి లింగంపల్లి మీదుగా తరిగొప్పుల, జనగామ నియోజకవర్గంలో కొనసాగింది. పాదయాత్రలో భాగంగా లింగంపల్లి గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర అధ్యక్షతన గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి గ్రామంలోని సమస్యలు తెలుపాలంటూ మహిళలను కోరగా, ఏ ఒక్కరూ స్పందిం చ లేదు. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకు రాకపోవడంతో భట్టి కలుగజేసుకొని మాట్లాడారు. భట్టి పాదయాత్రగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తే రైతులు తమ సమస్యలను చెబుతామనుకున్నారు. కానీ, ఆయన అదేమీ పట్టించుకోకపోవడంతో నిరాశ చెందారు. లింగంపల్లిలో జరిగిన పాదయాత్రలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఫొటో లేకపోవడంతో పాదయాత్రలో పాల్గొనకుండానే వెళ్లిపోయాడు. భట్టి గ్రామస్తులనుద్దేశించి మాట్లాడిన తర్వాత కనీసం జై కాంగ్రెస్ అని నినాదాలు కూడా చేయకపోవడంతో పాదయాత్రలో పసేముందని గ్రామస్తులు నిరాశ చెందారు.
నర్మెటలో ఉద్రిక్తత
జనగామ, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గం నర్మెట మండల కేంద్రంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అనుచరులు శుక్రవారం రాత్రి అడ్డుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పొన్నాల గోబ్యాక్.. డౌన్డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చి పాదయాత్రకు అడ్డుగా నిలిచిన కొమ్మూరి అనుచరులను పక్కకు తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోగా, ఇరువర్గాలు నినాదాలు చేసుకుంటూ తోపులాటకు దిగడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని జనగామ సెగ్మెంట్లో అడుగుపెట్టినప్పుటి నుంచి రాత్రి వరకు ఆద్యంతం భట్టి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అబ్దుల్నాగారం శివారులో విక్రమార్కకు పొన్నాల, కొమ్మూరి వర్గీయులు వేరు కుంపటి పెట్టి ఎవరికి వారే డప్పులు, డీజే సౌండ్ సిస్టమ్లు, ఓపెన్టాప్ వాహనాలు ఏర్పాటు చేసుకొని ఎవరి విడివిడిగా స్వాగతం పలికారు. తొలుత పొన్నాల సహా ఆయన అనుచరులు భట్టిని నియోజకవర్గంలోకి స్వాగతించి తోడ్కొని వస్తుండగడా, కొద్దిదూరంలో వేరు శిబిరంలో కొమ్మూరి సహా ఆయన వర్గీయులు ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
పాదయాత్రలో ఇరువర్గాలు ఒక్కచోట కలుసుకోగానే నినాదాలతో మొదలైన వివాదం తోపులాట, బాహాబాహీకి దారితీసింది. కొమ్మూరి వర్గీయుల ఆత్యుత్సాహం వల్లే వివాదం నెలకొన్నదనే భావనతో ఉన్న భట్టి ప్రెస్మీట్కు కూడా దూరం పెట్టడంతో ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయి సమయం దొరికితే గొడవ చేసేందుకు ప్రయత్నించారు. భట్టితో కలిసి పొన్నాల వెంట నడుస్తుండగా రాత్రి 9గంటలకు నర్మెట మండల కేంద్రానికి పాదయాత్ర చేరుకోగానే అప్పటికే వేచిచూస్తున్న కొమ్మూరి వర్గీయులు ఒక్కసారిగా పొన్నాల గోబ్యాక్..డౌన్డౌన్ పొన్నాల అంటూ నినాదాలు చేసుకుంటూ రోడ్డుకు అడ్డుగా నిలవడంతో భట్టి యాత్ర కొద్దిసేపు నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకొని కొమ్మూరి వర్గీయులను అడ్డుతొలగించి యాత్రను కొనసాగించేలా చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు సిద్ధం కావడంతో స్వల్పంగా లాఠీచేసి చెదరగొట్టడంతో యాత్ర ముందుకు సాగింది. కాగా, సీఎల్పీ నేత పాదయాత్రకు పోలీసులు సరైన భద్రత కల్పించడంలేదని ఇది మీ వైఫల్యం కాదా అంటూ నర్మెట సీఐ నాగబాబుపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేయడంతో భట్టి నచ్చిజెప్పి శాంతింపజేశారు.