వర్ధన్నపేట, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకే అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుకున్న మేరకు నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదు కావడంతో అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రజలు గుంపులుగా లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. నియోజకవర్గంలో 80.22శాతం ఓటింగ్ నమోదైంది. 2014లో 85శాతం నమోదు కాగా ఈ ఏడాది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 9గంటల వరకు 9.5శాతం, 11గంటల వరకు 22.4శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 42శాతం, 3 గంటల వరకు 55.5శాతం ఓటింగ్ నమోదుకాగా, సాయంత్రం 5గంటల వరకు 73శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2.69,192 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,32,736, మహిళలు 1,36,441, ఇతరులు 15 మంది ఉన్నారు.
నియోజకవర్గంలో 145 ప్రదేశాల్లో 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహనకు 327 మంది ప్రిసైడింగ్ 657 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతోపాటు 657 మంది ఓపీవోలు విధులు నిర్వర్తించారు. 170 వెబ్కాస్టింగ్ పోలింగ్ స్టేషన్లు, 63 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 59 మందిని మైక్రో అబ్జర్వర్లు పనిచేశారు. అధికారులు ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతోపాటు పోలింగ్ పూర్తయిన తర్వాత 36 రూట్లలో ఈవీఎంలతో తిరిగి ఎనుమాముల కేంద్రానికి భద్రతగా వెళ్లేలా 347 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాత్రి 7గంటల వరకు పోలింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలతో పాటు అధికారులు పోలీసు భద్రతతో ఎనుమాముల మార్కెట్కు వెళ్లిపోయారు.
హసన్పర్తి/మడికొండ: పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ స్టేషన్ల కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఉదయం 7గంటలకే కేంద్రాలకు వచ్చారు. తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగింది. సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఓటర్లు బారులు దీరారు. బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ దేవన్నపేట, చింతగట్టు, భీమారం హసన్పర్తిలో పోలింగ్ సరళిని పరిశీలించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓటింగ్ పూర్తి కాగానే ఈవీఎం మిషన్లను ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. భారీ భద్రత నడుమ ఈవీఎంలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 74.07శాతం ఓటింగ్ జరిగింది. ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్రావు కుటుంబ సమేతంగా వరంగల్లోని భారతీయ విద్యాభవన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, ఎర్రబెల్లి అనూప్ ఉన్నారు.
కాశీబుగ్గ: గ్రేటర్ వరంగల్లోని 3, 14వ డివిజన్లలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 3వ డివిజన్ పైడిపల్లి, ఆరపల్లి, కొత్తపేట, 14వ డివిజన్ ఎనుమాముల, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎస్ఆర్నగర్, ఇందిరమ్మకాలనీ, సాయిగణేశ్కాలనీ, ఎన్టీఆర్నగర్, కారల్మార్క్స్కాలనీ, ఐలమ్మనగర్లలో ఎలాంటి అవాంఛనీయమైన లేకుండా పోలింగ్ జరిగింది. 3వ డివిజన్లో 11వేల 400 ఓట్లకుగాను 9వేలు, 14వ డివిజన్లో 11వేల 800 ఓట్లకుగాను 9వేల ఓట్లు రాత్రి 9గంటల వరకు పోలింగ్ జరిగింది. వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేశ్ 3,14వ డివిజన్లలో జరిగే పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. కార్పొరేటర్లు జన్ను షీభారాణీ అనిల్, తూర్పాటి సులోచనా సారయ్య, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఈట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, వర్ధన్నపేట డివిజన్ల ఫోరం అధ్యక్షుడు నేరెళ్ల రాజు, 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహా, వరంగల్ పీఏసీఎస్ డైరెక్టర్లు లింగం కోటి, జన్ను స్వామిదాస్, మాజీ డైరెక్టర్ జన్ను రాజయ్య, తెలంగాణ గాడ్యూయేట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను సారంగపాణి, జన్ను రాంబాబు, చక్కర స్వామి, కుమ్మరి ప్రభాకర్, లింగం సాంబమూర్తి, పూర్ణచందర్, కేతిరి రాజశేఖర్ పాల్గొన్నారు. పైడిపల్లిలోని 125వ బూత్లో ల్యాదల్ల బ్లెసిన మొదటిసారి తన ఓటును వినియోగించుకుంది.
రాయపర్తి: మండల వ్యాప్తంగా 52పోలింగ్ కేంద్రాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ స్టేషన్లు జనం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పోలింగ్ వేగం పుంజుకుంది. పోలింగ్ శాతం 85శాతం మించడం విశేషం. పెర్కవేడు, మైలారం, బురహాన్పల్లి, కాట్రపల్లి, పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు సందర్శించారు. మండలంలోని మైలారం, పెర్కవేడులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటీలు పడి నినాదాలు చేసుకుంటూ భౌతికదాడులకు దిగే పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఐనవోలు: మండలంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రెవెన్యూ సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం 7గంటల నుంచి 9గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు బారులు తీరారు. 10 నుంచి 12గంటల వరకు మామూలుగా కొనసాగింది. 2 గంటల నుంచి 3 వరకు పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని రెండు నుంచి మూడు గ్రామాల్లో మాత్రమే 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగతా గ్రామంలో పోలింగ్ కేంద్రాల్లో 5గంటల తర్వాత ఓటర్లు బారులు తీరి రాత్రి వరకు వేశారు. నియోజకవర్గంలో 35 బూత్లల్లో 30,062 ఓటర్లు ఉండగా 25,969 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 86.38శాతం ఓట్లు పోల్ అయ్యాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని గర్మిళ్లపల్లి, వెంకటాపురం గ్రామాల్లో 5,725 ఓటర్లు ఉండగా, 5037 ఉండగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు గ్రామాల్లో సుమారు 87.98 పోలింగ్ శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ముల్కలగూడెం, సింగారం, కొండపర్తి, వనమాలకనపర్తి, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు, పున్నేల్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ పోలింగ్ సరళిని పరిశీలించారు. చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మధుమతి దంపతులు ఓటు హక్కును మండల కేంద్రంలో వినియోగించుకున్నారు. ఎన్నిక అబ్జర్వర్లు మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఏర్పాట్లు పైన ఆరా తీశారు.
పర్వతగిరి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ నంబర్ 265లో గురువారం బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, మండలంలో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ పరిశీలించారు. తొలిసారి ఓటు వేసిన యువతులతో కలిసి ఫొటో దిగారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. చౌటపెల్లిలోని పోలింగ్ బూత్లో వరంగల్ జిల్లా ఎన్నికల స్వీప్ ఐకాన్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య ఓటు వేశారు. 252 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచింది. అధికారులు ఈవీఎంను సెట్ చేయడంతో యథావిధిగా పోలింగ్ నిర్వహించారు.