అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పల్లె, పట్టణ జనం ఉత్సాహంతో పో(ఓ)టెత్తింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లకోసారి వచ్చే ‘ప్రజాస్వామ్య పండుగ’లో అందరూ భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుకాగా, మెజార్టీ కేంద్రాల్లో జనం బారులు తీరారు. మధ్యాహ్నం మందకొడిగా ఉన్న పోలింగ్ మళ్లీ సాయంత్రానికి పుంజుకున్నది. కాగా, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, వరంగల్ తూర్పులో రాత్రి 9గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఇక యువతతో పాటు ఈసారి కొత్త ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయాచోట్ల ఏర్పాటుచేసిన మోడల్, విమెన్, యూత్ పోలింగ్ స్టేషన్లను అందంగా అలంకరించగా అందరినీ అమితంగా ఆకట్టున్నాయి. ఈ సందర్భంగా ఓటేసిన యువత అక్కడున్న ఓటర్స్ సెల్ఫీ జోన్లో ‘ఐ కాస్ట్ మై వోట్’ అంటూ సెల్ఫీలు, ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకొని మురిసిపోయారు. వయోవృద్ధులు, దివ్యాంగులు సైతం బాధ్యతతో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపగా వారికి ఇబ్బంది లేకుండా ఆటోలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వీల్చైర్లో బూత్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించారు.
నర్సంపేట రూరల్: ఫస్ట్ టైం ఓటు వేయడం చాలా గర్వంగా ఉంది. నా జీవితంలో మొదటిసారి వేసిన ఓటును ఎప్పటికీ మరిచిపోను. మొదట్లో కొంత ఆందోళనకరంగా కనిపించినప్పటికీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాక చాలా సంతోషం వేసింది.
హనుమకొండ చౌరస్తా : నేను హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ చేస్తున్నా. మొదటిసారి ఓటు ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాను. చాలామంది యువత ఓటు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓటు వేసినప్పుడు నిజంగా నా ఓటు ఎంతో విలువైనదో అని తెలిసింది. ఇది నా బాధ్యత. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటా.
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 30(నమస్తే తెలంగాణ) : నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. మొదటిసారి పోలింగ్ కేంద్రంలో అడుగుపెట్టి ఓటు వేయడం కొత్త అనుభూతినిచ్చింది. చాలా సంతోషంగా ఉంది. భూపాలపల్లిలోని రెస్క్యూ స్టేషన్లో ఓటు వేశాను. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది.