వర్ధన్నపేట, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్కు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జిల్లా అధికాయ యంత్రాంగం ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని బుధవారం ఎన్నికలు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి అందజేశారు. బస్సుల్లో ఎన్నికల అధికారులు ఈవీఎంలు, సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రభుత్వ, పలు ప్రైవేట్ పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ బూత్ల వద్ద బీఎల్వోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు ఓటర్లకు సమస్యలు ఉంటే తెలియజేసేందుకు వారి ఫోన్ నంబర్లను కేంద్రాల వద్ద రాయించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,69,192 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,32,736 పురుషులు, 1,36,441 మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి, హనుమకొండ, ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట పూర్తి మండలాలతోపాటు పట్టణ పరిధిలోని ఖిలావరంగల్, వరంగల్, కాజీపేట పరిధిలోని ఓటర్లు 278 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2018లో 2.25లక్షల ఓటర్లలో 85 శాతానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 63 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. వర్ధన్నపేట పీవో, అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, ఇతర ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈవీఎం యంత్రాలను పీవో, ఏపీవోలకు అందజేశారు.
ఐనవోలు: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కోసం మండలంలోని పోలింగ్ కేంద్రాలకు బుధవారం ఈవీఎంలను చేరవేశారు. మండలంలో మొత్తం 30,062 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 14833, స్త్రీలు 15228, ఇతరులు 1 ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మండల వ్యాప్తంగా 35 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మండలంలోని గర్మిళ్లపల్లి, వెంకటాపుర గ్రామాల్లో మొత్తం 5,725 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 2,807, స్త్రీలు 2,918 ఉన్నారు. 6 పోలింగ్ బూత్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముందస్తుగా అధికారులు ఏర్పాట్లును చేశారు. ఓటర్లు సైతం ఫొటో గుర్తింపు కార్డు, చిట్టీలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటలకు వరకు పోలింగ్ జరగనుంది.
హసన్పర్తి: మండలంలోని వివిధ గ్రామాల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రం ఈవీఎంలు, సామగ్రితో చేరుకున్నారు.తెల్లవారితే ఓటింగ్ నిర్వహిందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పోలీస్ సిబ్బంది బందోబస్తుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద పోటీ చేసే అభ్యర్థుల వివరాలను గోడలకు అతికించారు.
కాశీబుగ్గ: అసెంబ్లీ ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అప్పగించారు. పోలింగ్ ఆర్వోలు ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రపరిచే గోదాంలను సందర్శించి పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని బయటకు తీయించారు. పత్తియార్డులో వరంగల్ తూర్పు అసెంబ్లీ, ఆపరాల యార్డులో వర్ధన్నపేట నియోజకవర్గ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.షణ్ముగరాజన్, కమిషనర్ ఎన్నికల ఆర్వో షేక్ రిజ్వాన్బాషా ఎన్నికల ప్రక్రియ, పంపిణీ క్లుప్తంగా వివరించారు. అనంతరం బస్సుల్లో ఎన్నికల సామగ్రితో పాటు సిబ్బందిని పోలీస్ ఎస్కార్ట్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. కాగా, ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలోని ఆపరరాల యార్డులో పోలీసు సిబ్బందితో డీసీపీ రవీందర్ సమావేశం నిర్వహించి, ఏసీపీ సతీష్బాబు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.