జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 10: జనగామ మండలం మరిగడి గ్రామంలో భూమి కోసం కన్నతల్లిని తల నరికి హత్య చేసిన కొడుకుతోపాటు కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ సీతారాం శుక్రవారం మీడియా సమావేశంలో నిందితులను చూపి, వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన కూరాకుల రమణమ్మ(65), రాజయ్య దంపతులకు కొడుకు కన్నప్ప, కూతురు లావణ్య. వీరికి 12ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రాజయ్య 15 ఏళ్ల క్రితం మృతిచెందగా, భూమి రమణమ్మ పేర ఉంది. కన్నప్పకు ఐదేండ్ల క్రితం జనగామకు చెందిన కల్యాణితో వివాహమైంది. కూతురు లావణ్యకు ఏడాదిన్నర క్రితం కొత్తగూడేనికి చెందిన సాయికుమార్తో పెళ్లయ్యింది.
కొన్నాళ్లకు భర్తతో గొడవలు కాగా, తనకు పుట్టిన బాబుతోపాటు లావణ్య తల్లితో కలిసి గ్రామంలోనే ఉంటోంది. కూతురికి ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేదని 10రోజుల క్రితం తల్లి తన పేర ఖిలాషాపూర్ గ్రామ శివారులో ఉన్న 4 ఎకరాల వ్యవసాయ భూమిని కూతురు లావణ్య పేర రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయం తెలిసిన కొడుకు కన్నప్ప ఈనెల 5వ తేదీన తల్లితో గొడవపడి తలపై కొట్టి గాయ పరిచాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అతడు ఉరేసుకునే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు చికిత్స కోసం దవాఖానలో చేర్పించారు.
లావణ్యకు రిజిస్ట్రేషన్ చేసిన 4 ఎకరాలను తమ పేర చేయాలని కొడుకు కన్నప్ప, కోడలు కల్యాణి మళ్లీ ఈనెల 9వ తేదీన ఉదయం రమణమ్మతో గొడవపడ్డారు. అందుకు అంగీకరించకపోవడంతో అతడు వెంట తెచ్చుకున్న కత్తితో రమణమ్మను మెడపై నరికి చంపాడు. అనంతరం జనగామ అర్బన్ పీఎస్లో నిందితులు లొంగిపోయారు. మృతురాలి కూతురు లావణ్య మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కే దేవేందర్రెడ్డి, అర్బన్ సీఐ ఎలబోయిన శ్రీనివాస్, ఎస్సైలు రఘుపతి, జీనత్, సిబ్బంది పాల్గొన్నారు.