సుబేదారి, జూలై 21 : విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు హాజరు కాగా, జోన్, డివిజన్ వారీగా సీపీ సమీక్ష చేశారు. పోలీసు స్టేషన్ల వారీగా ఆరునెలల వ్యవధిలో నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పోలీసు స్టేషన్లోనే న్యాయం చేయాలని ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలని, తప్పుడు కేసులు పెట్టొద్దని హెచ్చరించారు. ప్రతి కేసులో అధికారుల పనితీరుపై సమీక్ష చేస్తామని, తప్పు చేసినట్లు తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగదాల్లో తప్పకుండా ఎస్వోపీ విధానాన్ని అనుసరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లాడ్జీలు, వసతి గృహాల నిర్వహణను పర్యవేక్షించాలని, పోలీసుస్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు మురళీధర్, కరుణాకర్, సీతారాం, బారి, పుష్పా, ట్రైనీ ఐపీఎస్ అంకిత పాల్గొన్నారు.