వరంగల్, జూలై 7 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్తారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. కాజీపేటలో రూ.521 కోట్లతో చేపట్టనున్న వ్యాగన్ తయారీ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. రూ.5,500 కోట్లతో నిర్మించనున్న జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్.. వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి ఎకనామిక్ కారిడార్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని పర్యటన కోసం వరంగల్, హనుమకొండ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం నుంచే ప్రధాని ప్రయాణించే మార్గంలో నిషేధాజ్ఞలు అమల్లోకి రాను న్నాయి. నగరంలో అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. మోదీ ప్రయాణించే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భద్రకాళి దేవాలయానికి వెళ్లే అన్ని అంతర్గత రహదారులను మూసివేశారు. కాగా, వివిధ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని ప్రయాణించే రహదారుల వెంట ఉన్న షాపులను మూసివేయాలని, వెళ్లిన తర్వాతే తెరువాలని పోలీసులు ఆదేశించినట్లు సమాచారం.