ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి ప్రజలు, ముఖ్యంగా యువతలో ఆగ్రహానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కారణమైంది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి మొండిచెయ్యి చూపింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి.. పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి బతుకుదెరువు లభిస్తుందనుకుంటే ‘కోచ్’నై.. కుచ్నై అని ధోకా ఇచ్చి.. వ్యాగన్ మాన్యుఫాక్చర్ యూనిట్తో మభ్యపెడుతున్నది. అటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఆశలపై నీళ్లు జల్లింది. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి తొమ్మిదేళ్లు దాటినా మళ్లీ మాటెత్తకుండా నాన్చుతున్నది. ఇవన్నీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, ఏవీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్కు బీజేపీ సర్కారు తీరని అన్యాయం చేస్తున్నది. అయోధ్యపురం శివారులో వ్యాగన్ మానుఫాక్చర్ యూనిట్కు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ నేడు వరంగల్ పర్యటనకు వస్తుండగా ఆయా అంశాలపై ఏమైనా ప్రకటిస్తారా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా నేటి ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
వరంగల్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో వరంగల్ ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నాయి. ఓరుగల్లువాసుల పోరాటంతో 40 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇచ్చినట్లే ఇచ్చి రాజకీయ కారణాలతో దాన్ని పంజాబ్కు తరలించింది.
అప్పటి నుంచి కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఆశలు పెట్టుకున్న కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ సర్కారు సైతం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పి ధోకా ఇచ్చింది. నలభై ఏండ్ల కలను బీజేపీ చెరిపేయడంపై ప్రజలు, యువకులు, రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. అప్పటి నుంచి రైల్వే సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి.