వరంగల్, ఏప్రిల్ 12 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య చేపట్టిన నగర బాట ఫలితాలు కాలనీల్లో కనిపించనున్నాయి. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై గ్రేటర్ అధికారులు దృష్టి సారించారు. ప్రతి మంగళవారం 7 డివిజన్ల చొప్పున మేయర్, కమిషనర్ అధికారులతో కలిసి నగరబాట కార్యక్రమం చేపట్టారు. డివిజన్లలో పర్యటించి నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వీరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డివిజన్లలో గుర్తించిన సమస్యల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న వాటిని మొదట పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో సగం డివిజన్లలో నగరబాట కార్యక్రమం చేపట్టారు. 1 నుంచి 31వ డివిజన్లలో సమస్యలను గుర్తించారు. నగరబాటపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందించారు.
నగరబాటలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు గ్రేటర్ అధికారులు రూ.15 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. 31 డివిజన్లలో గుర్తించిన సమస్యల్లో దీర్ఘకాలంగా ఉన్న వాటిని మొదట పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన రహదారులు అన్ని స్మార్ట్రోడ్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. కాలనీల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను నగరబాట కార్యక్రమం ద్వారా గుర్తించి పరిష్కరిస్తున్నారు.
నగరబాట కార్యక్రమంతో కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. మేయర్, కమిషనర్, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. దీంతో కాలనీల్లోని కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. అయితే, నగరబాటలో మేయర్, కమిషనర్ ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.