జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ సారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. సుమారు 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, దాదాపు 3,29,068 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2.35 లక్షల టన్నులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 197 కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, సర్కారు ఆమోదించింది. ఇప్పటికే 189 సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించారు. అన్నదాతల నుంచి 32,622 టన్నుల వడ్లను ప్రభుత్వ మద్దతు ధరతో సేకరించారు. ధాన్యం రాశులను ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.
– వరంగల్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ)
వరంగల్, డిసెంబర్ 8(నమస్తేతెలంగాణ) : జిల్లా లో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోవడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే 32,622 టన్నుల ధా న్యం కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాది వానకాలం జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సుమారు 1.40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 3,29,068 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అం చనా వేశారు. ఇందులో 2,53,255 టన్నుల ధాన్యం మార్కెట్కు చేరుకోవచ్చని, మరో 18,255 టన్నులను రైస్మిల్లర్లు కొనుగోలు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
మిగతా 2.35 లక్షల టన్నులను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు గన్నీ సంచుల కేటాయింపు, కొనుగోలు కేంద్రాల మం జూరు, మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపా రు. ప్రభుత్వ అనుమతులతో గన్నీ సంచులను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో 9,67,889 గన్నీ సంచులు అందుబాటులో పెట్టారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటివరకు 189 కేంద్రా ల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగానే మొదట రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. తర్వాత ఖిలావరంగల్, గీసుగొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని గ్రామాల్లో కేంద్రాలను తెరిచారు. పాకాల ఆయకట్టులోనూ ఇటీవల వరి కోత లు ఆరంభం కావడంతో ప్రస్తుతం 189 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలిస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్ చెప్పారు.
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు ధాన్యం రవాణా కోసం ఐదు సెక్టార్లను గుర్తించామని, రైతుల నుంచి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని 84 రైస్మిల్లులకు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, రైతులు క్వింటాల్ గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున మద్దతు ధరను పొందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో పౌర సరఫరాల సంస్థ డబ్బులు జమ చేస్తున్నది.
పెరిగిన కేంద్రాలు..
గత సంవత్సరం వానకాలం కంటే ఈసారి ధాన్యం దిగుబడులు జిల్లాలో పెరుగనున్నందున అధికారులు కొనుగోలు కేంద్రాలను కూడా పెంచారు. గత ఏడాది జిల్లాలో 172 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో కేంద్రాల ఏర్పాటు కోసం పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తర్వాత మరికొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు అందగా, అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాల సంఖ్య 197కి ఎగబాకింది.
వీటిలో ఐకేపీకి 53, పీఏసీఎస్లకు 123, రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్పీవో)కు 20, మెప్మాకు ఒకటి చొప్పున కేంద్రాల కేటాయింపు జరిగింది. ఇప్పటివరకు 189 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఐకేపీ 51, పీఏసీఎస్లు 117, ఎఫ్పీవోలు 20, మెప్మా ఒక సెంటర్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ప్యాడీ క్లీనరు, తేమ కొలిచే యంత్రం, వేయింగ్ స్కేల్తో పాటు టార్పాలిన్లను ఏర్పాటు చేసింది. అధికారులు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు.