గోదావరి నీటితో పరవళ్లు తొక్కినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ప్రజా ఆశీర్వాద సభ వైపు పరుగులు తీశారు. ఉవ్వెత్తున తరలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం నిండిపోయింది. యువత కేరింతలు.. నినాదాలు, బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలంతో ప్రాంగణాలు దద్దరిల్లిపోయాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. ఈలలు, హర్షధ్వానాలతో మద్దతు తెలుపుతూ హోరెత్తించారు. సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. పినపాక బీఆర్ఎస్ అభ్యర్థిగా రేగా కాంతారావు, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.