హనుమకొండ, జూన్ 26 : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు పోటెత్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండు మూడు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు వచ్చి బారులుతీరారు. ప్రజల నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ విజ్ఞప్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం వివిధ సమస్యలపై భారీగా 180 దరఖాస్తులు వ చ్చినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
వచ్చిన వాటిలో రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్, డబుల్ బెడ్రూం సమస్యలే అధికంగా ఉన్నాయి. కాగా, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎల్హెచ్పీహెచ్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర వెంకట్ వినతిపత్రం అందజేశారు. అలాగే, దళిబంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు 40 శాతం కేటాయించాలని ఎస్సీ ఉపకులాల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గడ్డం చిరంజీవి వినతి పత్రం అందజేశారు. అలాగే, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా నేతలు నయీమొద్దిన్, నారాయణరావు, విద్యాసాగర్, సంజీవరెడ్డి, నర్సింహచారి, సరళ, శ్రీనివాస్రావు ఉన్నారు. అలాగే, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు పరికిరాల భూమయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజ్ఞప్తులు స్వీకరించిన వారిలో కలెక్టర్తో పాటు డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, డీపీవో వీ జగదీశ్వర్ ఉండగా, కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మేన శ్రీను, సర్వే లాండ్ రికార్డు ఏడీ ప్రభాకర్, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, సీపీవో సత్యనారాయణరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి కే మధురిమ, సోషల్ వెల్ఫేర్ అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత పాల్గొన్నారు.