హనుమకొండ చౌరస్తా, నవంబర్ 30: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం మందకోడిగా సాగిన ఓటింగ్ తర్వాత పుంజుకుంది. నియోజకవర్గ పరిధిలోని 5, 6, 7, 8, 10 డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. దివ్యాంగులు, వృద్ధులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. 6వ డివిజన్లోని ప్రభుత్వ మర్కజీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించి, పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు.
కాజీపేట : కాజీపేటలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి గొడవలు లేకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాలలోని 156వ బూత్ ఈవీఎం మొరాయించింది. దీంతో ఈ బూత్లో దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం సమయంలో ఓటర్లు తక్కువగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భారీగా ఓటును వినియోగించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చోని ఓటు వేశారు. కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ పర్యవేక్షణలో సాయుధ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలైన సోమిడి, బాపూజీనగర్, బాబు క్యాంపు, దర్గాకాజీపేటలో పోలీసులు బందోబస్తు బారీగా నిర్వహించారు. స్థానిక సీఐ సార్ల రాజు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా కాజీపేట ఎస్సైలు లలిత, నర్సింహారావు, ట్రైనీ ఎస్సైలు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ ఓటింగ్ సరళిని పరిశీలించారు.
కాజీపేటలోని పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. ఓటర్లను మర్యాద పూర్వకంగా పలకరించారు. కాగా, అక్కడ పలువురు వృద్ధులు, మహిళలు భారీ మెజార్టీతో గెలుస్తావని దాస్యం వినయ్భాస్కర్కు అభయమిచ్చారు. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.