లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్ర గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపింది. కేసీఆర్ నేరుగా కార్యరంగంలో దిగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. రోడ్షోలకు జనం వెల్లువెత్తడంతో పాటు ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
– వరంగల్ ప్రతినిధి/మహబూబాబాద్
(నమస్తే తెలంగాణ), మే 2 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో లోక్సభ ఎన్నికల చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. బస్సు యాత్రకు ప్రజల స్పందన అనూహ్యంగా ఉండడంతో బీఆర్ఎస్కు కచ్చితంగా అనుకూల ఫలితాలు ఉంటాయనే చర్చ జరుగుతున్నది. కేసీఆర్ రోడ్ షో అనంతరం వరంగల్, మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు పూర్తి ఆధిక్యత వచ్చే పరిస్థితి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ రోడ్ షోలో ఎక్కువగా మహిళలు, రైతులు, యువకులు ఉన్నారు. ఈ వర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్కు మొగ్గు కనిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని గుర్తు చేస్తూ రోడ్ షోలలో కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు, మూడున్నర కాంగ్రెస్ పాలనకు పోల్చి చూస్తే బీఆర్ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు గొప్పగా ఉంటున్నాయని పేద లు, మధ్య తరగతిలో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్, మహబూబాబాద్లో నిర్వహించిన రోడ్ షోలకు జనం స్పందన అనూహ్యంగా ఉన్నది. వేలాది మంది జనం కేసీఆర్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ఆయన ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. కేసీఆర్తో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయని తీరుపై ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు. కేసీఆర్ రోడ్షోలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ వరంగల్, మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థులు మారెపల్లి సుధీర్కుమార్, మాలోత్ కవిత గెలుపు నల్లేరు మీద నడకే అని కార్యకర్తలు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొంచెం స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల్లో కేసీఆర్ రోడ్ షో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ ఎస్కు మొదటి నుంచి గట్టి పట్టున్నది. ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2014 నుంచి 2021 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రికార్డు విజయాలను నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ఒక్క 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల్లో ఒకింత స్తబ్దత వచ్చింది. లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోలతో పరిస్థితి పూర్తిగా బీఆర్ఎస్కు అనుకూలంగా మారింది.
2014, 2019 తరహాలోనే ప్రస్తుత ఎన్నికల్లోనూ వరంగల్, మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో నూ ఈ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. 2015లో వరంగల్ లోక్సభకు జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి దేశంలోనే ఏడో అత్యధిక మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్రంలోనే వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి రికార్డు మెజారిటీ వచ్చింది. మహబూబాబాద్లోనూ ఎప్పుడూ లేనంత మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కేసీఆర్ రోడ్ షో తర్వాత ఉన్న పరిస్థితికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని, ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను ఏ పార్టీ ఆపబోదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.