‘అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆదరణ చూరగొన్న మహానేత.. దీనిని ఓర్వలేని మతతత్వ బీజేపీ, విజన్ లేని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. వీరిని తెలంగాణ సమాజం ఆదరించదు.. ప్రజలు క్షమించరు..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి, పెదతండా కేంద్రాలుగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
– దేవరుప్పుల, మే 22
దేవరుప్పుల, మే 22 : చిల్లరమల్లర రాజకీయాలను ప్రజలు క్షమించరని, తెలంగాణ సమాజం ఆదరించదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. విజన్ లేని కాంగ్రెస్, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీలు ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు. మండలంలోని సింగరాజుపల్లి, పెదతండా కేంద్రాలుగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు, వనరులు, అవసరాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు.
మిషన్కాకతీయ, మిషన్భగీరథ, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇవి భారతదేశ ప్రజలనే కాక అన్ని పార్టీలను ఆలోచింపజేస్తున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడమేగాక, హామీ ఇవ్వని పథకాలు సైతం సీఎం కేసీఆర్ ఆచరించి చూపారని దయాకర్రావు వివరించారు. దీనిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు చెక్డ్యాముల నిర్మాణంతో బీడు భూములకు సాగునీరంది సస్యశ్యామలం అయ్యాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని దీంతో ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. రియల్ఎస్టేట్ విస్తరించిందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండి గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రతీ కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన మహానేత సీఎం కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానంటున్నదని, అదే జరిగితే సంవత్సరానికి ప్రతి రైతు రూ. లక్ష చెల్లించాల్సి వస్తుందన్నారు. కేంద్రం ప్రతిపాదనను తిప్పికొట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారని, వచ్చే ఎన్నికల నాటికి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సైనికులుగా పనిచేసి గులాబీ జెండాను మూడోసారి ఎగిరేలా సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
గోదావరి జలాలతో సస్యశ్యామలం
ఉమ్మడి రాష్ట్రంలో భూములనమ్మి బతికిన తెలంగాణ రైతులు నేడు భూములను నమ్మి సాగు చేసకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో గోదావరి జలసవ్వడులు వినిపిస్తాయని, ఎస్సార్ఎస్పీ, దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, వాగులువంకలు సంవత్సరాంతం నిండుకుండల్లా ఉంటున్నాయన్నారు. నా నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలు తనను ప్రజలు ఆదరించేలా చేశాయన్నారు. ప్రజలే తనను కంటికి రెప్పలా కాపాడుకుంటారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా నియోజకవర్గంలో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు.