– గ్యాస్ సిలిండర్లు, గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి
– సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 23 : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానన్న రూ.10 వేలు ఇవ్వాలని, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. వేలాది మంది పేద విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యా వ్యవస్థకు కీలక సేవలు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోందని విమర్శించారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, కనీస వేతనం కూడా అమలు చేయకపోవడం, నెలల తరబడి వేతనాలు ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించక పోవడం, పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా పని చేయించడం మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.9 ఉంటే రూ.6 ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకుండా మెను ప్రకారం ఉండాలని ఒత్తిడి చేయడం సరైంది కాదన్నారు. టీచర్స్ అందరూ స్కూల్లో భోజనాలు చేయాలని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక బారాలతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఇంటిగ్రేటెడ్/సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాలను ప్రోత్సహిస్తే, వేలాది మంది విద్యార్థులు భోజనానికి దూరం అవుతారని, మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల విద్యార్థుల జీవితాలతో ప్రయోగాలు చేయకుండా, పాఠశాలల ఆధారిత మధ్యాహ్న భోజన వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పిట్టల అర్జున్, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి ఎస్.సుల్తానా, వెంకట నర్సమ్మ, రామలక్ష్మి, కుమారి, సమ్మక్క, శైలజ, రాణి, నజ్మా, శివకుమారి, అనసూయ, యామిని పాల్గొన్నారు.