శాయంపేట, నవంబర్ 5 : విజ్ఞులైన ఓటర్లు ఆలోచించాలని, కాంగ్రెస్కు ఓటేస్తే అధోగతేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని గంగిరేణిగూడెం, సాధన్పల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్పల్లి, అప్పయ్యపల్లి, నేరేడుపల్లి, ప్రగతిసింగారం, పత్తిపాక, హుస్సేన్పల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి, కొత్తగట్టుసింగారం గ్రామాల్లో పార్టీ శ్రేణులు, నేతలతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి హాజరైన గండ్ర బీఆర్ఎస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లుగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారని, కళ్లుండి కూడా చూడలేని కబోదులుగా వారు మారారన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించి మూడోసారి కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఊరిలో రోడ్లు, డ్రైన్స్, లైట్లు, మంచినీటి సమస్య ఎలా పరిష్కారమైందో చూడాలన్నారు. ప్రతిపక్ష నేతలకు రైతుల జీవితాల్లో వెలుగులు కనిపించడం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో వాయిదా పద్ధతిలో కరెంటు వచ్చేదని, ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? అని గండ్ర ప్రశ్నించారు.
రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, పిల్లలకు గురుకులాల ఏర్పాటు, రూపాయికే కిలో బియ్యం వస్తున్నది నిజం కాదా అని అన్నారు. సీఎం కేసీఆర్ రానున్న ఐదేళ్లలలో చేసే పనులను మ్యానిఫెస్టోలో చెప్పారన్నారు. పదవుల కోసం కొందరు నేతలు ఏడుపు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనరాజకీయ జీవితంలో ఎన్నడూ చేయి చాచలేదన్నారు. వేంకటేశ్వరస్వామి భక్తులమైన తాము భూపాలపల్లిలో గుడిని నిర్మించామని, ఇందుకోస పైసలు వసూలు చేశారని మాట్లాడుతున్నారని, ఆ అవసరం తమకు లేదన్నారు. దేవుడి గుడిని కాపాడాలని, సంపదను సృష్టించాలని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏం మాట్లాడుతున్నారో నాయకులకు అర్థం కావడం లేదని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదవుల కోసం ఆకలిమీద ఉన్నారని, పదవి ఇస్తే అన్నీ మింగేస్తారన్నారు. తాము ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నామని, పదవులున్నా, లేకపోయినా ఇలానే ఉంటామని ఎమ్మెల్యే గండ్ర స్పష్టం చేశారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య లొల్లి ముదురుతోందని, పదవుల కోసం పాకులాడుతున్నా రే కానీ, ఎన్నికలప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని, అభివృద్ధిచేసేందుకు డబ్బుల్లేవని సీఎం చేతులెత్తేశారన్నారు. నమ్మి ఓట్లేస్తే కరెంటు ఉండదని, ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతాయన్నారు. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని, మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.
అనంతరం వరంగల్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడు తూ ప్రజలే మా బలం, బలగమని పేర్కొన్నారు. రాజకీయాల కోసం నీతిమాలిన మాటలు మాట్లాడేవారికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. మంచి చేసే గండ్ర వెంకటరమణారెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లామన్నారు. ఈ సందర్బంగా పత్తిపాకలో ముదిరాజ్ కులస్తులతో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పత్తిపాక గ్రామ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిల్లా శ్రీనివాస్ను ప్రకటించారు. సమావేశాల్లో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతాలక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుంగల మనోహర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, గట్ల విజయ్పాల్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.