జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 రోజుల్లో 2,79,455 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఊరూరా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉత్సాహంగా కేంద్రానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొని, మందులు, కళ్లద్దాలు పొంది మురిసిపోతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2,79,455 మందికి పరీక్షలు చేయగా, వీరిలో 41,456 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. మరో 26,702 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చామని, త్వరలోనే వీటిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు డీఎంహెచ్వో వెంకటరమణ వెల్లడించారు.
– పోచమ్మమైదాన్, మార్చి 21
పోచమ్మమైదాన్, మార్చి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్ర మం జిల్లాలో 42వ రోజుకు చేరింది. ఈ సందర్భం గా వైద్యులు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దశలవారీగా ప్రజలకు నేత్ర పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే బాధ తప్పిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు జిల్లావ్యాప్తంగా 2,79,455 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఇప్పటి వరకు 147 జీపీల్లో పూర్తి కాగా, 25 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
42 మున్సిపల్ వార్డు ల్లో పూర్తిగా, 19 వార్డుల్లో చివ రి దశలో ఉన్నాయి. వీరిలో 1,31,463 మంది పురుషులు, 1,47,668 మంది మహిళలు, 309 మంది హిజ్రాలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందు లో ఎస్సీలు 40,770 మంది, ఎస్టీలు 31,893, బీసీ లు 1,86,949, ఓసీలు 11,916, మైనార్టీలు 7,912 మంది ఉన్నారని డీఎంహెచ్వో తెలిపారు. కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్న 41,456 మందికి రీడింగ్ గ్లాసులు అందజేసి, 26,702 మందికి ప్రిస్కిప్షిన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. 2,11,297 మందికి ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.
అంధత్వ నివారణకు దోహదం
నర్సంపేటరూరల్/పర్వతగిరి/గీసుగొండ: కంటి వెలుగు కార్యక్రమం అంధత్వ నివారణకు దోహదం చేస్తుందని నర్సంపేట మండలం రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్ బొజ్జ యువరాజ్, చంద్రయ్యపల్లి ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునిత, వైద్యాధికారులు శ్రీదేవి, కల్యాణి, కంటి వెలుగు క్యాంపు ఇన్చార్జి డాక్టర్ కవిత, మల్లారెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని దౌలత్నగర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, సర్పంచ్ కొల్లూరి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మాలోత్ కాంతమ్మ, వైద్యాధికారి సుమన్, కార్యదర్శి సుమలత పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్పంచ్ నాగేశ్వరావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుగులోత్ రాజు, నాయకులు రాజేందర్, తిరుపతి, సురేందర్ పాల్గొన్నారు.
మసకపడ్డ కళ్లకు వెలుగులు : జన్ను ఆదాం, దేశాయిపేట
నా కళ్లు మసమబారగా కంటి వెలుగు శిబిరానికి వచ్చాను. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి చుక్కలు మందు ఇచ్చారు. ఈ మందులు వేసుకున్న తర్వాత నా కళ్లల్లోని మసకలు పోయి తేజ్గా కనిపిస్తున్నాయి. మా ఇంట్లో వాళ్లందరికీ కూడా కంటి పరీక్షలు చేయించాను. అందరి కళ్లు బాగున్నాయి. సీఎం కేసీఆర్ సల్లగుండాలె.
సంతోషంగా ఉంది : దేవర రాజమణి, ఎంహెచ్నగర్
కంటి వెలుగు శిబిరంలో కళ్ల పరీక్షలు చేయించుకున్నాక నాకు సంతోషంగా ఉంది. కంటి జబ్బులు ఏమీ లేవని చెప్పారు. ప్రైవేట్ దవాఖానకు పోయి పరీక్షలు చేయించుకోవాలంలే చేతిలో పైసలు లేవు. ఏం చేయాలో తోచక ఎదురు చూశాను. ఈ సమయంలో కంటి వెలుగు వచ్చి మాకు ఆనందం నింపింది.