గిర్మాజీపేట/హనుమకొండ చౌరస్తా, మార్చి 18 : వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరైనట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. 9,448 రెగ్యులర్ విద్యార్థులకు 9,432 హాజరు కాగా 16 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే, 8 మంది ప్రైవేట్ విద్యార్థులకు నలుగురు హాజరైనట్లు డీఈవో వెల్లడించారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. అలాగే, హనుమకొండ జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాల్లో తెలుగు పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 12,014 మందికి 12,000 మంది విద్యార్థులు (99.88 శాతం) హాజరయ్యారు. అలాగే, ప్రైవేట్ విద్యార్థులు నలుగురు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎండీ అబ్దుల్ హై, ప్రభుత్వ పరీక్షల సహాయ నిర్వహణాధికారి చలపతిరావు తెలిపారు.
హనుమకొండ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ మరజీ ఉన్నత పాఠశాల, షైన్ సూల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.