పనులు చేయిస్తున్న ప్రజాప్రతినిధులు
అధికారుల ఆకస్మిక తనిఖీలు
పరిశుభ్రమవుతున్న కాలనీలు
పచ్చదనం, శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు
వరంగల్లో నాలా పనులను పరిశీలించిన మేయర్ గుండు సుధారాణి
‘పట్టణప్రగతి’ జోరుగా సాగుతున్నది. పదో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని కరీమాబాద్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న సాకరాశికుంట నాలాను మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట పట్టణంలో అదనపు కలెక్టర్ హరిసింగ్ మహిళలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. నర్సంపేటలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి తనిఖీ చేశారు.
వర్ధన్నపేట, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆదివారం పదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బందితో పారిశుధ్య, అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ సూచనలు అందిస్తున్నారు. తద్వారా కాలనీలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఇందులో వర్ధన్నపేట పట్టణంలో జరుగుతున్న పనులను అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణతో కలిసి మహిళలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యర్థ నీటిని రోడ్లపైకి వదిలిపెట్టడం వల్ల అపరిశుభ్ర వాతావరణం తయారై అనారోగ్యాల బారిన పడుతారని తెలిపారు. ప్రజలు విధిగా తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించిన కోట్లాది రూపాయల వ్యయంతో పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో ఇంటి ముంగిట్లోకి వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు రవీందర్, రామకృష్ణ పాల్గొన్నారు.
సాకరాశికుంట నాలా పనులను పరిశీలిస్తున్న మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు పల్లం పద్మ, అరుణ
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి
నర్సంపేట: గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ కోరారు. నర్సంపేటలో ఆదివారం ఆమె పట్టణప్రగతి పనులను పరిశీలించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత ఉండదన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నాలా నిర్మాణానికి రూ. 50 లక్షలు
కరీమాబాద్: వర్షపునీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని కరీమాబాద్ ప్రధాన రహదారిపై మూడు వెంట్లతో సాకరాశికుంట నాలా నిర్మాణం చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈ మేరకు ఆమె సాకరాశికుంట నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నాలాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో రెండు వెంట్లు ఉన్నా ఒక్క వెంట్ ద్వారా నీరు వెళ్లలేని పరిస్థితి ఉండడం వల్ల పలు కాలనీలు ముంపునకు గురయ్యేవారని వివరించారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. మేయర్ వెంట కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, అధికారులు ఉన్నారు. అలాగే, 32, 39, 40, 41, 42వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, వరంగల్ పట్టణ ప్రగతిలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తడి, పొడి చెత్తపై అవగాహన
పోచమ్మమైదాన్/గిర్మాజీపేట: వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని ఎన్పీఆర్నగర్లో తడి, పొడి చెత్తపై కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో పర్యటించారు. ఇళ్ల నుంచి వెలువడే చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని కోరారు. 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో తొలగింపజేశారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి కాలనీల్లో పర్యటించారు. 25వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ శ్రీమాన్ ఆధ్వర్యంలో అర్బన్ స్పైస్ హోటల్ వెనుక గల్లీ నుంచి మండిబజార్ వరకు ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో శాంతినగర్లో పట్టణ ప్రగతి పనులు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు, బిల్ కలెక్టర్లు రజినీకుమార్, వినీల్, రాకేశ్, అంగన్వాడీ టీచర్లు శారద, భాగ్యలక్ష్మి, సుజాత, భవాని, జ్యోతి, మున్సిపల్ జవాన్లు రవీందర్, రాధిక పాల్గొన్నారు.