వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : అత్యున్నత వైద్య సేవలే లక్ష్యంగా రూ.150 కోట్లతో నిర్మించిన కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది. ఆరు అంతస్తులు గల ఈ భవనంలో 250 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, కనీసం అవసరమైన లిఫ్ట్లు పనిచేయకపోవడం గమనార్హం. నిత్యం వందల సంఖ్యలో ఓపీ సేవలు, పదుల సంఖ్యలో ఇన్సేషెంట్ల అడ్మిష న్లు కొనసాగుతున్నా, దవాఖాన నిర్వహణపై అధికారులు మా త్రం శ్రద్ధ కనబర్చడం లేదు. అత్యవసర సమయంలో పేషెంట్లను తరలించడానికి, వైద్యులు, రోగులు, అటెండెంట్లు పై అం తస్తులకు వెళ్లడానికి వీలుగా ఆరు ఆధునిక, భారీ లిఫ్ట్లను ఏ ర్పాటు చేయగా, వాటిలో నాలుగు లిఫ్ట్లు ఆరు నెలలుగా పని చేయకపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్లోని చివరి రెండు లిఫ్ట్ల సా యంతో నెట్టుకొస్తున్నారు.
నాలుగు రోజులుగా అవికూడా పనిచేయకపోవడంతో నరకయాతన పడుతున్నారు. దీంతో వృద్ధులు, మెట్ల మార్గంలో వెళ్లలేని వారు గత్యంతరం లేక ర్యాంప్ ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నారు. రూ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఆస్పత్రిలో నిర్వహణ లోపం వల్ల సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ఆరు నెలలుగా లిఫ్ట్ల విషయా న్ని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కొందరు వైద్యులే చెబుతుండగా, రోగులు మాత్రం అనారోగ్యంతో హాస్పిటల్కు వస్తే మెట్లు ఎక్కలేక, దిగలేక కొత్తగా మోకాళ్ల నొప్పులు వచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని మొదటి అంతస్తులో న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రెండో అంతస్తులో యూరాలజీ, నెఫ్రాలజీ, మూడో అంతస్తులో కార్డియాలజీ, నాల్గవ అంతస్తులో చిన్న పిల్లలకు సేవలు అందించే పీడీయాట్రిక్ విభాగం, ఐదో అంతస్తులో డయాలసిస్ సేవలు, ఆరో అంతస్తులో ఆపరేషన్ థియేటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో కార్డియాలజీ, డయాలసిస్ సేవలు పొందే రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
ఈ క్రమంలో లిఫ్ట్ పని చేయకపోవడంతో పై అంతస్తులకు చేరుకోవడానికి రోగులతో పాటుగా వైద్యులు, సిబ్బంది, అటెండెంట్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వివిధ అవసరాల కోసం మూడు నుంచి నాలుగు సార్లు పైకి, కిందకి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లిఫ్ట్లకు మరమ్మతు చేయించాలని రోగులు, అటెండెంట్లతో పాటు వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు.