పరకాల, జూలై 29 : ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పంటల వివరాలు, వరుస వర్షాలతో నష్టపోయిన రైతుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమాకు పట్టాపాస్ బుక్కు కలిగి ఉన్న రైతులందరూ అర్హత పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం నుంచి జూన్ 22 వరకు కొత్తగా పాసుబుక్ పొందిన 18నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి రైతూ ఆగస్టు 1వరకు ఏఈవోలకు బీమా కోసం దరఖాస్తులు అందించాలని సూచించారు. ఏఈవోలు తమ క్లస్టర్లలో, ఏవోలు మండల కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను పూర్తి స్థాయిలో సర్వే చేసి, జాబితాను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రవీందర్, పలు మండలాల ప్రజాప్రతినిధులు, ఏవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
సంగెం : నియోజకవర్గంలోని గీసుకొండ, సంగెం మండలాలతో పాటు విలీన గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ.9.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో సంగెం జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, శివ, గన్ను సంపత్, కోడూరి రమేశ్ పాల్గొన్నారు.