‘కష్టకాలంలో రైతులకు అండగా నిలుద్దాం. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను పక్కాగా సేకరించాలి. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి నష్ట పరిహారం అందేలా చూడాలి.’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, వొడితెల సతీశ్కుమార్తో కలిసి హనుమకొండ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు. మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి కాంటాల్లో కోత లేకుండా చూడాలన్నారు.
వరంగల్, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షాలతో పంటల నష్టాలు, వడ్ల కొనుగోళ్లపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్లతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారుతో మంత్రి సోమవారం హనుమకొండలోని క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యం కల్పించాలని ఆదేశించారు.
దెబ్బతిన్న పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. కౌలు రైతులతో పాటు, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి, కాంటాల్లో కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వడ్లను త్వరగా రవాణా చేయాలన్నారు. మక్కజొన్నల కొనుగోలుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని రైతులకు వివరించాలని సూచించారు. మక్కజొన్నల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, డీఏవో ఉషాదయాళ్, డీఆర్డీడీవోలు శ్రీనివాస్కుమార్, సంపత్రావు పాల్గొన్నారు. కాగా, అకాల వర్షాలతో వరంగల్ జిల్లాలో 10,871 మంది రైతులకు చెందిన 11,141 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. హనుమకొండ జిల్లాలో 19,230 మంది రైతులకు చెందిన 21,040 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టంపై మరోసారి పూర్తి వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.