దేవరుప్పుల, నవంబర్ 1 : పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డి తీరుతో ఆ పార్టీ నేతల్లో ఒకింత ఆగ్రహం, ఆవేదన కట్టలు తెచ్చుకుంటున్నది. 40ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న సీనియర్లు, ఆమె ఒంటెత్తు పోకడ కారణంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడే పరిస్థితి వచ్చింది. ముందొచ్చిన చెవులకన్నా.. వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్న చందాన వ్యవహారం ఉందని మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం దేవరుప్పులలోని ఓ ఫంక్షన్హాల్లో వీరంతా సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. మూడు నెలలుగా తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకున్న ఝాన్సీరెడ్డి కనీసం తమకు పరిచయం లేదని, కనీసం సీనియర్లను కలుపుకొనిపోయే ప్రయత్నం కూడా ఆమె నేటికీ చేయలేదని నారాజ్ అవుతున్నారు. మరోవైపు ఆమె స్థానంలో వచ్చిన కోడలు యశస్విని పంథా కూడా అలాగే ఉందని చెబుతున్నారు. అందరి మద్దతు కూడగట్టకుంటే ఓటమి ఎరుగని నాయకుడు దయాకర్రావును ఢీకొట్టడం సాధ్యమేనా అన్న విషయాన్ని ఝాన్సీరెడ్డి విస్మరిస్తున్నదని చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూకుమ్మడి రాజీనామాలే శరణ్యమనే ఆలోచనకు వచ్చారు. కాంగ్రెస్లో ఏళ్ల తరబడి కొనసాగుతూ, పార్టీకి పాలనా పగ్గాలు లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలదొక్కుకున్న తమకు స్వయంగా పార్టీలోనే అవమానాలు జరిగే రోజులు వస్తాయని అస్సలు ఊహించలేదని ఆవేదన చెందుతున్నారు. వారం క్రితం ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి నేతృత్వంలో జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో ఈ నెల 2వరకు తిరుపతిరెడ్డి పరిస్థితిని చక్కబెట్టాలని ఝాన్సీరెడ్డికి సూచించారని అయినా పద్ధతి మారలేదని చెబుతున్నారు. ఇక తమదారి తాము చూసుకునే సమయం వచ్చిందని చెబుతున్నారు. ఒకవైపు మంత్రి దయాకర్రావు నియోజకవర్గాన్ని ఇప్పటికే మూడుసార్లు చుట్టి వస్తే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇలా తయారైందని వాపోతున్నారు.
వర్ధన్నపేట, నవంబర్ 1 : వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి నమిండ్ల శ్రీనివాస్ హాజరుకాకపోవ డంతో మీటింగ్ బుధవారం వాయిదా పడింది. అధిష్టానం వర్ధన్నపేట అభ్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్.నాగరాజును ప్రకటించింది. కానీ చాలాకాలంగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ అబ్జర్వర్లు బుధ వారం జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇంట్లో నియోజకవర్గ ముఖ్య నాయకులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల నాయకులు, మండల బాధ్యులు హాజరైనా హసన్పర్తి, హనుమకొండ మండలాల నాయకులెవరూ రాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. పార్టీ కోసం చాలాకాలంగా పనిచేసిన నమిండ్ల శ్రీనివాస్ ఈ సమావేశానికి రాకపోవడం వల్లే హనుమకొండ, హసన్పర్తి మండలాల ముఖ్యనాయ కులు రాలేదని సమాచారం. అభ్యర్థి కూడా పార్టీలో పనిచేసే ముఖ్యనా యకులను సమన్వయం చేయడం లేదని కార్యకర్తలే చర్చించుకోవడం కనిపించింది. ఇక ప్రచారం ప్రారంభించాలనుకున్న సమయంలో ఇలా కావడంతో రూట్మ్యాప్ కూడా తయారుచేయలేదని చర్చించుకున్నారు.