దేవరుప్పుల, జనవరి 25 : పద్నాలుగేళ్ల ప్రాయంలో ‘చిన్నికృష్ణుడి’గా కళారంగంలోకి అడుగుపెట్టి.. ‘కీచక’ పాత్రతో గుర్తింపు తెచ్చుకొని, ‘రంగస్థలం’పై లోహితాన్యుడు, సిరియాళుడు, బాలవద్ధి, సత్యహరిశ్చంద్రుడు, కంసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడి వేషధారణలతో ప్రేక్షకులను అలరించి..సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపై వేలాది ప్రదర్శనలతో ప్రజలను మెప్పించిన గడ్డం సమ్మయ్యను ‘పద్మశ్రీ’ వరించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. రామస్వామి, ఛండికాంబ దంపతులకు 1958, జనవరి 5న సమ్మయ్య జన్మించాడు. ఆయనకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు. సంచార జీవితం గడుపుతూ సమ్మయ్య కుటుంబం అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడింది. గ్రామంలోనే సమ్మయ్య ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. సమ్మయ్యకు 1983లో శ్రీరంజనితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు. పెదకొడుకు సోమరాజు చిందు కళా ప్రదర్శనలు ఇస్తున్నాడు. రెండో కొడుకు హిమగిరి ఇంజినీరింగ్ పూర్తిచేసి మల్టీనేషనల్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కొడుకు మురళీకృష్ణ ఫొటోగ్రఫీలో బీఎఫ్ఏ పూర్తిచేశారు.
తన తండ్రి ప్రోత్సాహంతో చిన్ని కృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టిన సమ్మయ్య, 1985లో జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988 లో నెహ్రూ యువకేంద్రం ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తొమ్మిదిమంది బృందంతో రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలతో పాటు 1991లో ఆలిండియా రేడియోలో 80 ప్రదర్శనలు, దూరదర్శనిలో 30 ప్రదర్శనలు, యువజన సాంస్కృతిక పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. 1991లో కళాకారుల సంఘాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం తరఫున అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపైనా ప్రదర్శనలు ఇచ్చాడు. 5దశాబ్దాలలో 19వేల ప్రదర్శనలతో అరుదైన గుర్తింపు సాధించాడు. సమ్మ య్య జీవిత విశేషాలతో ‘చిందుల హంస’ అనే పుస్తకం కూడా వెలువడింది.
1985లో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతితో సన్మానం, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో అప్పటి గవర్నర్ చేతులమీదుగా కళారత్న (హంస) పురస్కారం, రూ. 5వేల నగదు బహుమానం, 2001లో నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఉత్సవాల్లో సన్మా నం, 2003లో హైదరాబాద్లోని శిల్పారామంలో అప్పటి సీఎం చేతుల మీదుగా విశిష్ట పురస్కారం, 2009లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బంగారు కంకణం ప్రదానం, 2017లో ‘తెలంగాణ ఆవిర్భావ పురస్కారం’ అందుకున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర ప్ర భుత్వం గురువారం సాయంత్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చిం దు యక్షగాన కళాకారుడిగా కళారంగానికి ఆయ న చేసిన సేవలకు గాను ఈ గుర్తిం పు దక్కింది. సమ్మయ్యకు పద్మశ్రీ అ వార్డు రావడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హర్షం వ్య క్తం చేశారు. సమ్మయ్యకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.