ఖిలావరంగల్, నవంబర్ 3: ఆజంజాహి మిల్లును అమ్ముకొని వరంగల్ ప్రజల ఉపాధిని దూరం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నన్నపునేని 38వ డివిజన్ పద్మశాలి వీధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటి తలుపు తట్టి మూడోసారి కేసీఆర్ గెలుపు ఆవశ్యకత, బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే, తూర్పులో తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం పద్మశాలి కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీడీ పరిశ్రమను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కలవాలంటే వంచనగిరి, వర్ధన్నపేటకు వెళ్లాల్సి వస్తదన్నారు. తాను లోకల్ అని, ఎవరికి ఆపద వచ్చినా ఇక్కడే ఉంటానని, తనను పది నిమిషాల్లో కలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. పద్మశాలి కమ్యూనిటీ హాలుకు సంబంధించిన అన్ని సహాయ సహకారాలు అందించానని, ఇకముందు కూడా అవసరమైనప్పుడు సాయం చేస్తారనన్నారు.
పద్మశాలి కాలనీని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని, మిగిలిన పనులను ఎన్నికలైన వెంటనే పూర్తి చేస్తామన్నారు. తనకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, పర్యాటక ప్రాంతంగా విలసిల్లితే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. 38వ డివిజన్కు రూ. 4 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నిరుపేదలకు గృహలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాలను ఎన్నికల తర్వాత అందిస్తామన్నారు. ఆడబిడ్డలను అన్ని విధాలా ఆదుకుంటున్నది కేవలం కేసీఆర్ మాత్రమేనన్నారు. ఎన్నికలు రాగానే చాలా మంది వస్తారని, ఎన్నికల తర్వాత ఒక్కరు కూడా కనిపించరని ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలం, వరదలు, ఇటీవల దసరా, బతుకమ్మ పండుగలు అన్నింటికీ తాను అండగా నిలిచానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడి ప్రజలు ఉపాధి కోల్పోతే సీఎం కేసీఆర్ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మించారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్తోపాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పద్మశాలి సంఘం పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని ప్రతి గడపకూ వివరించాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు బైపాస్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో 12, 13, 20, 22, 23, 25 డివిజన్లకు చెందిన వంద ఓట్ల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. సమష్టిగా పని చేసి విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖిలావరంగల్: తూర్పు నియోజకవర్గానికి వెళ్లి తప్పు చేశామని అవమానించినోళ్లు మళ్లీ వస్తున్నారని, రౌడీయిజం, గూండాయిజం చేసేటోళ్లు మనకు అవసరమా అని, వారిపై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శివనగర్లోని కార్మిక సంఘం భవనంలో 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో 35వ డివిజన్ నుంచి మేరుగు అశోక్, సీనియర్ నాయకుడు గడ్డం రవితోపాటు సుమారు 80 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వీరందరికీ ఎమ్మెల్యే నన్నపునేని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస వచ్చినోళ్లను ఎన్నుకుంటే నియోజకవర్గ ప్రజలు ఆగమవుతారన్నారు. తనపై నమ్మకంతో సీపీఎం నుంచి బీఆర్ఎస్లో చేరితే వారికి మూడు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి గెలిపించామన్నారు. గుడిసె వాసులకు పట్టాలిచ్చామన్నారు. తూర్పులో తాను 43 గుడిసె కాలనీల్లో చేసిన అభివృద్ధిని చూసి, జక్కలొద్దిలోని గుడిసె కాలనీ వాసులు మూడు వేల మంది మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నమ్మే పరిస్థితిలో తూర్పు నియోజకవర్గ ప్రజలు లేరన్నారు. పార్టీలో చేరిన మేరుగు అశోక్, గడ్డం రవికి సముచిత స్థానం కలిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే, 36వ డివిజన్కు చెందిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు లక్క శివతోపాటు మరికొందరు బీఆర్ఎస్లో చేరారు. అంతేకాకుండా 35వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎండీ సలీమ్కు కూడా ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గిర్మాజీపేట: ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి తామంతా అండగా ఉంటామని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా 18వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు ఐయిత అరుణ్భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యూత్ నాయకుడు ఆరెపల్లి రాకేశ్తోపాటు 40 మందికి శివనగర్లో ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో నన్నపునేనికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏనాడూ ఈ ప్రాంతాన్ని పట్టించుకోని వారు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షుడు గడ్డమీది రాజేశ్ పాల్గొన్నారు. కాగా, ఎన్నికల ఖర్చు కోసం ఎమ్మెల్యే నరేందర్కు 35వ డివిజన్కు చెందిన షేక్ అఫ్సర్ కుమారులు షేక్ నూమాన్, రయ్యాన్ తమ పాకెట్ మనీ రూ. 5 వేలను విరాళంగా అందించారు. చిన్నారులు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు నన్నపునేని సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు.
ఖిలావరంగల్, నవంబర్ 3: సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో వృద్ధులకు ఇస్తున్న ఆసరా పింఛన్ ఎంతో భరోసా ఇస్తున్నది. వారి గుండెల్లో నిండిన అభిమానంతో 38వ డివిజన్ పడమర కోటలో శుక్రవారం ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను ఓ వృద్ధురాలు ఆప్యాయంగా పలకరించింది. కేసీఆర్ సారు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పెంచుతున్నారట కదా బిడ్డా.. ఆసరా పింఛన్ ఇస్తున్న కేసీఆర్, మీరు సల్లంగా ఉండాలె బిడ్డా.. మా ఓటు కారు గుర్తుకే వేస్తా.. మళ్లీ నువ్వే గెలుస్తవ్ బిడ్డా అంటూ ఆశీర్వదించింది.