జిల్లాలో 80శాతం ధాన్యం సేకరణ
31కేంద్రాల్లో 100శాతం
లక్ష్యం 1.55 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటికే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తి
వారంలో వంద శాతం దిశగా కసరత్తు
జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ధాన్యం సేకరణ లక్ష్యం 1.55లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 200 కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఇప్పటికే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లలో 80శాతం పూర్తయింది. అలాగే 31 కేంద్రాల్లో 100 వంద శాతం నమోదుకాగా మరో వారం, పది రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారయంత్రాంగం చెబుతోంది. అలాగే సేకరించి ధాన్యానికి గాను ఇప్పటివరకు రూ.145.55కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది.
జనగామ, మే 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేంద్రాల ద్వారా రైతుల నుంచి జోరుగా వడ్లు సేకరిస్తున్నారు. యాసంగి సీజన్కు గాను జిల్లావ్యాప్తంగా 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. మొత్తం 200 కేంద్రాలకు గాను ఇప్పటికే 31 కేంద్రాల్లో 100శాతం, 169 కేంద్రాల్లో 80శాతం పూర్తయింది. యాసంగి సీజన్లో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటికే సేకరించిన 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 22,442 మంది రైతులకు రూ.231కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.145.55కోట్లు నేరుగా రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. మిగిలిన రైతుల బిల్లుల చెల్లింపులోనూ వేగవంతంగా చేశారు. ధాన్యం విక్రయించిన బిల్లులు జిల్లా పౌరసరఫరాల శాఖకు చేరిన 24గంటల్లోపే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులను జమ చేస్తున్నారు. గతంలో మాదిరిగా గ్రామాల్లోనే సేకరణ జరిపి నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు వేయడం సహా డిఫాల్ట్ మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
జనగామ నియోజకవర్గంలో 36,958, పాలకుర్తి నియోజకవర్గంలో 35,097, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 48,211 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ఇంకా 35,559 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, వ్యవసాయశాఖల అధికారులతో కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్రావు పలుమార్లు సమీక్షలు నిర్వహించి కొనుగోళ్లపై దిశానిర్దేశం చేశారు. కేంద్రాల ఏర్పాటు సహా రవాణా, గన్నీ బ్యాగుల సరఫరా, బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి రికార్డుస్థాయిలో సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారం వంద శాతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఇబ్బందుల్లేకుండా చేస్తున్నాం..
ఏ.భాస్కర్రావు, జిల్లా అదనపు కలెక్టర్
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడడంతో పాటు బిల్లుల చెల్లింపులోనూ జాప్యం లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతు నుంచి ఎలాంటి తరుగు లేకుండా పూర్తి పారదర్శకంగా కొనుగోలు జరుగుతున్నాయి. ధాన్యాన్ని తెచ్చే రైతులు తాలు, గింజలు, పొల్లు లేకుండా తీసుకురావాలి, తేమ తప్పనిసరి 17శాతం లోపు ఉంటే రైతుల నుంచి మొత్తం ధాన్యం సేకరిస్తాం. వారం, పది రోజుల్లో వంద శాతం సేకరిస్తాం.
ధర్మగడ్డ కొనుగోలు కేంద్రంలో సంబురాలు
దేవరుప్పుల : ధర్మగడ్డ తండా నూతన గ్రామపంచాయతీ ఏర్పడగా ఆ గ్రామంలో మొదటి సారిగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కొనుగోలు పూర్తి కావడంతో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సంబురాలు జరుపుకున్నారు. మంత్రి ఎర్రబెల్లిని స్థానిక రైతులు, మహిళా సంఘాలు కోరడంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చొరవ చూపారు. చంద్ర గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో 89 మంది రైతుల నుంచి 5332 క్వింటాళ్ల ధాన్యం సేకరించి మిల్లులకు పంపించగా 60 శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం కేంద్రం నుంచి చివరి లారీ వెళ్లడంతో సంబురాలు జరుపుకున్నారు. సర్పంచ్ సునీత, ఐకేపీ ఏపీఎం సత్యనారాయణ, చంద్ర గామైఖ్య సంఘం అధ్యక్షకార్యదర్శులు భూక్యా అరుణ, భూక్యా మంగమ్మ, సీసీ యాకయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు జ్యోతి, చందన, మత్రు పాల్గొన్నారు.